యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్కు ఇషాన్ ఎంపిక కానున్నాడని తెలుస్తోంది. టీమిండియా తరఫున 26 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ చివరిగా గతేడాది నవంబర్లో ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ మానసిక ఒత్తిడి కారణంగా భారత్కు తిరిగొచ్చాడు.
అనంతరం దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ సూచించినప్పటికి ఇషాన్ కిషన్ ఆసక్తి చూపలేదు. నేరుగా ఐపీఎల్తోనే పోటీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు ఇషాన్ కిషన్పై బీసీసీఐ వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న ఇషాన్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో సత్తాచాటాడు. శతకంతో చెలరేగాడు.

అయితే ఇషాన్ కిషన్ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడని తెలుస్తోంది. బంగ్లాదేశ్ టీ20 సిరీస్కు రిషభ్ పంత్కు విశ్రాంతిని ఇచ్చి, అతని స్థానంలో ఇషాన్ను తీసుకోనున్నారని సమాచారం. ఓపెనర్గానే కాకుండా మిడిలార్డర్ బ్యాటర్గానూ ఇషాన్ సత్తాచాటగలడు. బంగ్లాదేశ్ టీ20 సిరీస్కు ఇషాన్ కిషన్, సంజు శాంసన్లు వికెట్ కీపర్లుగా ఎంపిక కానున్నారని తెలుస్తోంది.
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ అనంతరం భారత్.. న్యూజిలాండ్తో మూడు టెస్టులు, ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పంత్పై పనిభారం పడకుండా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తూ, ఇషాన్ కిషన్కు ఛాన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. కాగా, అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా రెండో టీ20, అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఆఖరి టీ20 జరగనుంది.