
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్తో తనకున్న సాన్నిహిత్యాన్ని మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వెల్లడించాడు. పంత్, తాను మంచి స్నేహితులమని తెలిపాడు. అలాగే తామిద్దరం కలిసి ఎక్కువగా తిరుగుతుంటామని చెప్పుకొచ్చాడు. తన మనసులో మాటలను అతడితో చెప్పుకుంటానని, అలాగే అతని మనుస్సులోని మాటలను కూడా పంత్ తనతో షేర్ చేసుకుంటాడని ఇషాన్ కిషన్ తెలిపాడు. అయితే తామిద్దరం క్రికెట్ గురించి ఎక్కువగా చర్చించుకుంటామని వెల్లడించాడు. అలాగే ఎప్పుడు కూడా టీమిండియాలోని రిషబ్ పంత్ స్థానం తనకు కావాలని కోరుకోలేదని ఇషాన్ తెలిపాడు. ఇద్దరికీ జట్టులో స్థానం ఉన్నందున అతడిని తాను ఎప్పుడూ కూడా ఒక పోటీదారుడిగా చూడలేదని వివరించాడు. పంత్ కూడా తనను ఎప్పుడూ కూడా అతని పోటీ దారుడిగా చూడలేదని కిషన్ చెప్పాడు.
అయితే టీమిండియా తుది జట్టులో స్థానం గురించి తాను ఎప్పడూ ఆలోచించలేదని ఇషాన్ కిషన్ అంటున్నాడు. మనం బాగా ఆడితే, అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెబుతున్నాడు. తనకు ముఖ్యంగా వికెట్ కీపింగ్ అంటే చాలా ఇష్టమని, కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా కీపింగ్లో తన వంతు పాత్ర పోషిస్తున్నానని పేర్కొన్నాడు. కాగా రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ ఇద్దరూ ఒకేసారి 2016 అండర్ 19 ప్రపంచకప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో ఇషాన్ కిషన్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించగా.. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు.
కాగా ఇషాన్ కిషన్ కంటే రిషబ్ పంతే భారత జట్టులోకి ముందుగా అడుగుపెట్టాడు. వికెట్ కీపింగ్లో ధోని వారసుడిగా ఎదిగాడు. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడంతోపాటు టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా మారాడు. కాగా గతేడాదే టీమిండియాలోకి అడుగుపెట్టిన ఇషాన్ కిషన్ ప్రస్తుతం జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. అరంగేట్ర టీ20 మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు భారత జట్టు తరఫున 4 వన్డేలు, 8 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇక ఐపీఎల్లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.