ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ సారి ఎక్కువ ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ నిలిచాడు. మెగా వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడగా భారీ ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్తో మెగా వేలం బరిలోకి దిగిన కిషన్ను 15 కోట్ల 25 లక్షల రూపాయల భారీ ధరకు అంబానీ టీం దక్కించుకుంది. దీంతో ఈ సారి ఇషాన్ కిషన్కు దక్కిన భారీ ధర క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సారి మెగా వేలంలో ఇషాన్ కిషన్ భారీ ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే అతడికి భారీ ధర దక్కింది.
ఈ నేపథ్యంలో ఓ క్రీడా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ మెగా వేలంలో తనకు లభించిన భారీ ధరపై ఇషాన్ కిషన్ స్పందించాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్కప్ పైనే ఉందని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ20 ప్రపంచకప్ గెలవడంపైనే దృష్టి సారించినట్లు చెప్పాడు. అంతేకానీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ నుంచి తాను తీసుకుంటున్న భారీ రెమ్యునరేషన్పై కాదని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. కాగా ప్రస్తుతం ఇషాన్ కిషన్ శ్రీలంకతో టీ20 సిరీస్కు సిద్ధమవుతున్నాడు. వెస్టిండీస్తో సిరీస్లో ఆశించిన మేర రాణించలేకపోయిన ఈ యువ ఓపెనర్ శ్రీలంకతో సిరీస్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. ఇందుకోసం సిద్ధమవుతున్నాడు.
ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, జొఫ్రా ఆర్చర్, డేవిడ్ బ్రెవిస్, డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జయ్దేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్ , ఫాబియన్ అలెన్, మయాంక్ మార్కండే, సంజయ్ యాదవ్, బసిల్ థంపి, అర్జున్ టెండూల్కర్, ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్, అన్మోల్ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ది, రమణ్ దీప్ సింగ్.