Ishan Kishan: భారత క్రికెటర్ ఇషాన్ కిషన్, మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ చౌదరి ఒ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఇషాన్ కిషన్ తో ఆయన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచ్లోనే 106 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీని ఇషాన్ కిషన్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ వైరల్ వీడియోలో వికెట్ కీపింగ్ సమయంలో వేగంగా ఉండే పాకిస్థాన్ వికెట్ కీపర్, పాకిస్థాన్ వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ పై ఇషాన్ కిషన్ విమర్శలు గుప్పించాడు.
ఆ వీడియోలో అంపైర్ అనిల్ చౌదరి ఇషాన్ కిషన్ను ప్రశంసిస్తూ.. ఇషాన్ ఇప్పుడు పరిణతి చెందిన ఆటగాడిగా మారాడని అన్నారు. దీంతో పాటు గతంలో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తున్నప్పు చాలా అప్పీల్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఇషాన్ అలా చేయడం లేదని.. ఈ మార్పు ఎలా వచ్చిందని ఇషాన్ కిషన్ ను అనిల్ చౌదరి అడిగారు.

మహ్మద్ రిజ్వాన్లాగా ఏదైనా చేస్తే..
ఇషాన్ కిషన్ ఆ ప్రశ్నకు ఫన్నీగా బదులిస్తూ.. "అంపైర్లు తెలివైనవారు అయ్యారని నేను అనుకుంటున్నాను. మనం ప్రతిసారీ అప్పీల్ చేస్తే అంపైర్ అవుట్కు కూడా నాటౌట్ ఇస్తాడు. ఒకసారి అప్పీల్ చేయడం మంచిది. సరైన సమయంలో అప్పీల్ చేయాలి. సరైన సమయంలోనే అప్పీల్ చేస్తేనే అంపైర్లకు మనపై నమ్మకం ఉంటుంది. లేకపోతే మహ్మద్ రిజ్వాన్ లాగా ఏదైనా చేస్తే.. అంపైర్లు ఒక్కసారి కూడా ఔట్ ఇవ్వరు."అని అన్నాడు. అంటే రిజ్వాన్ ప్రతీసారి అప్పీల్ చేస్తాడని చెప్పకనే చెప్పాడు.
మంచి ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ ప్రస్తుతం గొప్ప ఫామ్ లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ 11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. అంతకు ముందు సన్రైజర్స్ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించింది. అందులోనూ ఇషాన్ కిషన్ విధ్వంసక రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఇషాన్ కిషన్ తన ఐపీఎల్ కెరీర్ లో 3 వేల పరుగులు పూర్తి చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. దీని కోసం ఇషాన్ కిషన్ కు ఇంకా 250 పరుగులు కావాలి.