
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్లో తొలి మ్యాచ్ నేడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా రాహుల్, స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాచ్కు ముందు ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. మ్యాచ్కు ముందు ఇరు జట్లు జాతీయ గీతం ఆలపించే సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇక మన జాతీయగీతం పాడుతుండగా.. భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ను ఓ పురుగు ముప్పుతిప్పలు పెట్టింది. చెవుల్లో దూరాలని ప్రయత్నించింది. అయితే పురుగు సడెన్గా ఎటాక్ చేయడంతో కిషన్ కాసేపు హడావుడికి గురయ్యాడు. మళ్లీ వెంటనే తేరుకుని జాతీయ గీతం ఆలపించాడు.
ఈ వీడియోను ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశాడు. 'ఇషాన్ కిషన్పై పురుగు దాడి జరిగింది' అని క్యాప్షన్ పెట్టాడు.
ఈ వీడియోలో కిషన్ జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు బగ్ అతన్ని అంత ఇబ్బంది పెట్టినా.. అతని పక్కనే ఉన్న భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏమాత్రం కదలక మెదలక జాతీయ గీతాన్ని పూర్తి ధ్యానంతో పాడుతుండడం కన్పించింది. చాలా మంది జాతీయ గీతం పట్ల కుల్దీప్ యాదవ్ శ్రద్ధాసక్తులను మెచ్చుకుంటున్నారు. ఇక జాతీయ గీతం అయిపోయాక ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు.
మొదటి వన్డే మ్యాచ్లో భారత ప్లేయింగ్ XIలో కిషన్కు చోటు దక్కింది. అయితే అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదు. ధావన్, శుభ్ మన్ గిల్ కడవరకు క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని ముగించారు.
దీంతో ఇషాన్ వన్ డౌన్ బ్యాటర్ అయినా అతనికి బ్యాటింగ్ దక్కలేదు. ఇక ఆసియా కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో కూడా కిషన్కు చోటు దక్కలేదు. అయినా అతను సానుకూలంగానే వ్యవహరించాడు. మరింత కష్టపడి ఎక్కువ పరుగులు చేస్తానని, తద్వారా సెలెక్టర్ల గుర్తింపు పొందుతానని ఇషాన్ పేర్కొన్నాడు. ఇకపోతే టీ20లలో ఇషాన్ 14మ్యాచ్లలో 130.30 స్ట్రైక్ రేట్తో 430పరుగులు చేశాడు. ఈ సంవత్సరం T20 ఫార్మాట్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడుగా అతను కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.