రంజీ ట్రోఫీలో పాల్గొనాలని బీసీసీఐ జారీ చేసినా ఆదేశాలను టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లెక్కచేయనట్లుగా తెలుస్తోంది. టీమిండియాకు దూరంగా ఉన్న ఆటగాళ్లందరూ తమ రాష్ట్ర క్రికెట్ బోర్డులకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ తమ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లకు హుకుమ్ జారీచేసిన విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్తో పాటు శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్లకు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
దీంతో రంజీ ట్రోఫీలో రాజస్థాన్తో ఇవాళ ప్రారంభం కానున్న మ్యాచ్లో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడని అందరూ భావించారు. కానీ ఇషాన్ కిషన్ ఎవరి అంచనాలకు అందట్లేదు. తాను అందుబాటులో ఉన్నట్లుగా ఇషాన్ జార్ఖండ్ జట్టుతో చెప్పలేదని తెలుస్తోంది. ఇషాన్ లేకుండానే జార్ఖండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. కుమార కుషాగ్ర వికెట్కీపర్గా బరిలోకి దిగాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన జార్ఖండ్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. రాజస్థాన్ మ్యాచ్లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. 119 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

మరోవైపు శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్ కూడా తమ రాష్ట్ర జట్లకు అందుబాటులో లేరు. కాగా, మానసిక అలసట కారణంగా ఇషాన్ కిషన్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే వెనుదిరిగొచ్చాడు. అయితే ఆ తర్వాత అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ఇషాన్ కిషన్ ఎంపిక అవ్వలేదు. మానసిక సమస్యల కారణంగా దూరమైన ఇషాన్ తిరిగి జట్టులోకి రావాలంటే పోటీ క్రికెట్ను ఆడి రావాలని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ సూచించాడు.
కానీ రంజీ ట్రోఫీలో ఆడటానికి ఇషాన్ కిషన్ ఆసక్తి చూపలేదు. ఈ విషయంలో బీసీసీఐ ఆగ్రహం ఉందని వార్తలు వచ్చాయి. రంజీలో తప్పకుండా ఆడాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేగాక ఐపీఎల్లో ఆడాలంటే రంజీ ట్రోఫీలో కనీసం 3-4 మ్యాచ్లు ఆడాలని కొత్త నిబంధనలు కూడా తీసుకురావాలని చూస్తోంది. ఇవన్నీ ఇషాన్ కిషన్ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ చర్యలు చేపడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.
మరోవైపు ఇషాన్ కిషన్ వీటిని పట్టించుకోకుండా పాండ్య బ్రదర్స్ హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఇషాన్ కిషన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో 'గ్రేడ్-సీ'లో ఉన్నాడు. ఏడాదికి రూ.కోటి వేతనం అందుకుంటున్నాడు.