
బెంగళూరు: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు ఐపీఎల్ 2022 మెగా వేలంలో అదృష్టం కలిసొచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సారి ఇప్పటివరకు జరిగిన వేలంలో అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. అది కూడా తన పాత టీం ముంబై ఇండియన్సే కిషన్ను కొనుగోలు చేయడం గమనార్హం. ఇషాన్ కిషన్ వేలంలో భారీ ధర పలుకుతాడని మొదటి నుంచి అంచనాలున్నాయి. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్తో వేలంలో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ను ముంబై ఇండియన్స్ 15 కోట్ల 25 లక్షల రూపాయల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ముంబైకి కిషన్ అంత సులువుగా లభించలేదు. గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి ఆ ఫ్రాంచైజీకి గట్టి పోటీ ఎదురైంది. సన్రైజర్స్ చివరి వరకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
గతేడాది ముంబై ఇండియన్స్కే ప్రాతినిధ్యం వహించిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు అప్పుడు ఆ జట్టు 6 కోట్ల 20 లక్షల రూపాయలు చెల్లించింది. కానీ మంచి ఫామ్లో ఉన్న కిషన్ను రిటెన్సన్ జాబితాలో చేర్చుకోలేదు. కానీ వేలంలో మాత్రం వదలకుండా భారీ ధర అయినా సరే వెచ్చించి కొనుగోలు చేసింది. వేలంలో ఎంత ధరైనా సరే వెచ్చించి కొనుగోలు చేయాలని ముంబై ఇండియన్స్ ముందే భావించి బెంగళూరులో అడుగు పెట్టినట్లుంది. అందుకే ఇషాన్ కిషన్ పేరు రాగానే ఏ మాత్రం తగ్గకుండా రేటు పెంచుకుంటూ పోయింది. ఇతరులను నుంచి పోటీ ఎదురైనా లెక్క చేయలేదు. చివరికి తాము అనుకున్నట్లు ఇషాన్ కిషన్ దక్కడంతో ముంబై ఇండియన్స్ ఓనర్లు వేలంలోనే చిన్నపాటి సంబరాలు కూడా చేసుకున్నారు. కాగా గతంలో కన్నా కిషన్కు ఈ సారి ముంబై 9 కోట్ల 5 లక్షల రూపాయలు ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేయడం విశేషం. ఈ ధర గతంలో రెండింతల కన్నా ఎక్కువ.