Ishan Kishan 76 vs New Zealand : న్యూజిలాండ్ జట్టుతో రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు సంజూ శాంసన్(6), అభిషేక్ శర్మ(0) త్వరగానే ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. కానీ మూడో నంబర్లో వచ్చిన ఇషాన్ కిషన్( Ishan Kishan 76 vs New Zealand) కివీస్ బౌలర్లపై సింహస్వప్నంలా విరుచుకుపడ్డాడు.
ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లోనే 76 పరుగులు చేసి మైదానాన్ని హోరెత్తించాడు. ఇందులో 11 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్ ఇన్నింగ్స్ ఎంత వేగంగా సాగిందంటే.. అతడి స్ట్రైక్ రేట్ 237.5గా నమోదైంది. ఇషాన్ కిషన్ ఆడుతున్న తీరు చూసి కివీస్ బౌలర్లు బంతులు ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇషాన్ కిషన్ కేవలం 48 బంతుల్లోనే 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది. చివరకు ఇష్ సోథీ బౌలింగ్లో ఇషాన్ కిషన్ ఔట్ అయినప్పుడు.. సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ముందుకు వచ్చి ఇషాన్ కిషన్ ను హత్తుకుని అభినందించడం మైదానంలో హైలైట్గా నిలిచింది.
ఇషాన్ కిషన్ ఔట్ అయిన తర్వాత డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్ స్టేడియంలోకి వచ్చారు. సాధారణంగా సీరియస్గా ఉండే గంభీర్.. ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్కు ముగ్దుడై అతడి వీపు తట్టి శభాష్ అని మెచ్చుకున్నారు. డగౌట్లోకి చేరుకున్న ఇషాన్ కిషన్కు సహచర ఆటగాళ్లందరూ నిలబడి స్వాగతం పలికారు.
అంతకుముందు బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్పై న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ (47*) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కీలకమైన రెండు వికెట్లు తీసి కివీస్ను కట్టడి చేశాడు. చివరకు భారత్ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.