ఉప్పల్ టెస్టు పరాజయం తర్వాత టీమిండియా బలంగా పుంజుకుంది. వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్పై 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయిదు టెస్టు సిరీస్లో 1-1తో సమంగా నిలిచి మిగిలిన మూడు టెస్టులపై ఆసక్తి పెంచింది. అయితే విజయం సాధించినప్పటికీ టీమిండియా ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ అనుకూలించే పిచ్పై బ్యాటర్ల వైఫల్యంతో స్పిన్నర్లు ఒత్తిడిలోకి వెళ్లారని అన్నాడు. ఇంగ్లండ్పై గెలిచినప్పటికీ జట్టు లోపాలను సరిదిద్దుకోవాలని దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ సూచించాడు.
''సిరీస్లో మొదటి మ్యాచ్ ఓటమి అనంతరం 1-1తో తిరిగి పోటీలోకి రావడానికి దూకుడు, పోరాటం, నమ్మకం చాలా అవసరం. కెప్టెన్గా రోహిత్ జట్టులోని ఆటగాళ్ల నుంచి మంచి ప్రదర్శనే రాబట్టుకున్నాడు. కానీ జట్టులో కొన్ని విషయాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇలాంటి పరిస్థితులు, పిచ్పై భారత్ గొప్పగా రాణించి పరుగులు చేస్తుందని ఆశించాం''

''మరోవైపు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ను గమనించండి. ఆ జట్టులో ఒక్కరు మాత్రమే హాఫ్ సెంచరీ సాధించారు. కానీ 300 స్కోరు వరకు చేరుకున్నారు. సమష్టిగా పోరాడారు. మన జట్టులో రెండు అద్భుత ప్రదర్శనలు ఉన్నాయి. యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ అదరగొట్టారు. కానీ బ్యాట్తో భారత్ చేయాల్సిన పని ఇంకా ఉంది'' అని జహీర్ ఖాన్ అన్నాడు.
వైజాగ్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ 209 పరుగులతో సత్తాచాటాడు. కానీ జట్టులో రెండో అత్యధిక స్కోరు శుభ్మన్ గిల్ చేసిన 34 పరుగులే. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ 104 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ (45) ఫర్వాలేదనిపించాడు. కానీ మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ 14, 17 పరుగులతో నిరాశపరిచాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 292 పరుగులు చేసింది.
''బౌలింగ్ విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా ముందుండి అద్భుతంగా జట్టును ఆదుకున్నాడు. అయితే ఇలాంటి పిచ్లపై స్పిన్నర్లు కొన్ని సందర్భాల్లో ఒత్తిడిలోకి వెళ్తారు. బ్యాటర్లు పరుగులు చేసి వాళ్లని ఆదుకోవాలి. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని కెప్టెన్ అర్థంచేసుకుని వాటిని సరిదిద్దాలి. అయితే సారథిగా రోహిత్ రాణించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా జట్టును నడిపించాడు'' అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.
రెండో టెస్టు విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ టీమిండియా బ్యాటింగ్ లోపాల గురించి మాట్లాడాడు. కుదురుకున్న బ్యాటర్లు మంచి స్కోరులు సాధించడంలో విఫలమవుతున్నారని ఒప్పుకున్నాడు. ఈ విషయంపై మరింత దృష్టిసారిస్తామని చెప్పాడు. కాగా, రాజ్కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది.