ఇస్లామాబాద్: ఇటీవలి కాలంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అఫ్రిది ఇటీవల కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. 'ప్రపంచమంతా కరోనా వైరస్పై పోరాడుతోంది కానీ.. మోడీ మనసులో వైరస్ కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉంది. పాక్ సైన్యం ఏడు లక్షలు.. ఒక్క కాశ్మీర్లోనే భారత ప్రభుత్వం అంతకంటే ఎక్కువ మంది సైన్యాన్ని పెట్టింది. కాశ్మీర్ పౌరులు పాక్ సైన్యానికే సపోర్ట్ చేస్తున్నారు' అని అఫ్రిది పేర్కొన్నాడు.
నేనే సాక్ష్యం.. అక్తర్ బౌలింగ్లో సచిన్ కళ్లు మూసుకుని ఆడాడు: పాక్ పేసర్
కరోనా బాధితులకు తన స్వచ్చంద సంస్థ ద్వారా సాయం చేస్తున్న అఫ్రిది ఆ మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించాడు. అదే అదనుగా భారత ప్రధాని మోడీపై పెద్ద ఎత్తున విమర్శలు చేసాడు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఫ్రిదిపై భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్లు తీవ్ర స్థాయిలో మండిపడి.. తమ స్నేహం ఇక కటీఫ్ అని పేర్కొన్నారు .అఫ్రిది రాజకీయాల్లోకి వెళ్లాలని ఆశించి.. పాకిస్థాన్లో తన పాపులారిటీని పెంచుకునేందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని భారత మాజీ క్రికెటర్లు అన్నారు.
భారత మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలపై తాజాగా షాహిద్ అఫ్రిది క్లారిటీ ఇచ్చాడు. తనకి రాజకీయాల్లో వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. 'ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే.. ఎప్పుడో వెళ్లేవాడిని. మా పార్టీలో చేరనుందని చాలా రాజకీయ పార్టీలు నన్ను సంప్రదించాయి. ఇప్పటికే నేను పొలిటీషియన్ చేసే సేవా కార్యక్రమాలను చేస్తున్నా. దానికి అన్ని పార్టీల నుంచి మద్దతు కూడా లభిస్తోంది. కానీ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన నాకు లేదు. ప్రస్తుతం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాగా పనిచేస్తున్నాడు. మేమందరం అతనికి మద్దతు ఇస్తాం' అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.
తాజాగా భజ్జీ, యూవీ వ్యాఖ్యలపై అఫ్రిది స్పందించాడు. కశ్మీర్, మోడీపై తాను చేసి వ్యాఖ్యలు వైరల్ కావడంతోనే యువరాజ్, హర్భజన్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అఫ్రిది పేర్కొన్నాడు. భారత్లో ప్రజలు అణచివేతకు గురువుతున్నారని వారికి కూడా తెలుసన్నాడు. 'నా ఫౌండేషన్కు అండగా నిలుస్తూ సాయం చేసిన హర్భజన్, యువరాజ్ పట్ల నేనెప్పుడు కృతజ్ఞుడిగా ఉంటాను. అసలు సమస్య ఏంటంటే వారిపై నెలకొన్న ఒత్తిడే. వారు ఆ దేశం నివసిస్తున్నారు. కాబట్టి నిస్సహాయులగా ఉండిపోయారు. వారికి కూడా తెలుసు ఆ దేశంలో ప్రజలను ఎలా అణచివేస్తున్నారో. ఇంతకంటే నేనేం చెప్పలేను' అని అఫ్రిది పేర్కొన్నాడు.