భారత క్రికెట్లో సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు తరచుగా వివాదాస్పదమవుతుంటాయి. ముఖ్యంగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలో సెలెక్టర్ల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశవాళీ క్రికెట్లో అసాధారణ ఫామ్లో ఉన్నా టీమిండియాలో సర్ఫరాజ్ ఖాన్కు చోటు దక్కకపోవడంపై మాజీ దిగ్గజం దిలీప్ వెంగ్సర్కార్ ఘాటుగా స్పందించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని ఆయన నిలదీశారు. దేశవాళీ క్రికెట్లో పరుగుల సునామీ సృష్టిస్తున్నా సర్ఫరాజ్ ఖాన్ను విస్మరించడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్న ఆటగాడిని తొక్కేస్తున్నారంటూ సెలెక్షన్ కమిటీపై విరుచుకుపడ్డారు.
దేశవాళీలో పరుగుల వరద.. టీమిండియాలో మాత్రం మొండిచేయి!
సర్ఫరాజ్ ఖాన్ ఈ సీజన్ వైట్ బాల్ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 6 మ్యాచ్ల్లోనే 200 పైచిలుకు స్ట్రైక్ రేట్తో మూడు అర్ధ శతకాలు బాదాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో గోవాపై కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. తన తమ్ముడు ముషీర్ ఖాన్తో కలిసి ముంబై జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇన్ని రికార్డులు సృష్టిస్తున్నా అతడిని ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరం పెట్టడంపై దిలీప్ వెంగ్సర్కార్ విస్మయం వ్యక్తం చేశారు.

ఇది నిజంగా అవమానకరం -వెంగ్సర్కార్
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన దిలీప్ వెంగ్సర్కార్ సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు చేశారు. "సర్ఫరాజ్ ఖాన్ను ఏ ఫార్మాట్లోనూ ఎంపిక చేయకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అతనికి అవకాశం వచ్చినప్పుడు భారత్ తరపున కూడా బాగా ఆడాడు. ధర్మశాలలో ఇంగ్లాండ్పై పడిక్కల్తో కలిసి సర్ఫరాజ్ ఖాన్ ఆడిన ఇన్నింగ్స్ భారత్ గెలవడానికి ఎంతగానో ఉపయోగపడింది. అటువంటి టాలెంట్ను విస్మరించడం, నిర్లక్ష్యం చేయడం నిజంగా అవమానకరం" అని ఆయన అన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే పరిస్థితి
2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సర్ఫరాజ్ ఆస్ట్రేలియా వెళ్లినప్పటికీ.. సర్ఫరాజ్ ఖాన్కు ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు. భారత్ బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడుతున్నా సర్ఫరాజ్ను పక్కన పెట్టడంపై వెంగ్సర్కార్ మండిపడ్డారు. "అతను అన్ని ఫార్మాట్లు ఆడగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. కానీ అతనికి అవకాశాలు ఇవ్వకపోవడం నాకేం అర్థం కావడం లేదు" అని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2026లో కొత్త ప్రయాణం
మరోవైపు ఐపీఎల్ 2026 వేలంలో సర్ఫరాజ్ ఖాన్ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన బేస్ ప్రైస్ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకు ఆడిన సర్ఫరాజ్, ఈసారి ధోనీ సేనలో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.