ఐపీఎల్లో తుంటి గాయానికి గురైన పృథ్వీ షా
ఐపీఎల్లో తుంటి గాయానికి గురైన పృథ్వీ షా... అనంతరం వెస్టిండీస్-ఎతో భారత్-ఎ వన్డే, టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటా ఫిజియోల సాయంతో గాయం నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా ఒకవైపు... ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షల్లో పృథ్వీ షా విఫలమయ్యాడు. పృథ్వీ షా మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. ఇది సాధారణంగా దగ్గు మందుల్లో ఉంటుందని పేర్కొన్న బీసీసీఐ..
వాడా నిబంధనల ప్రకారం
అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం మ్యాచ్లు ఆడేటపుడు లేదా బయట కూడా దీనిని ఉపయోగించకూడదు. అయితే, జులై 16నే పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే బీసీసీఐ పృథ్వీ షాకి నోటీసులు జారీ చేసింది. దగ్గు మందు వినియోగం వల్లే నిషేధిత ఉత్ప్రేరకం తన ఒంట్లోకి వచ్చిందని పృథ్వీ ఇచ్చిన వివరణతో బీసీసీఐ సంతృప్తి చెందలేదు. దీంతో అతడిపై 8 నెలలు పాటు నిషేధం విధించింది. పృథ్వీ షాకి విధించిన శిక్ష నవంబరు 15కి పూర్తి కానుంది.
తాను ఉద్దేశపూర్వకంగా ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని
అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఏ నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, ఈ ఏడాది ఆరంభంలో తాను వేసుకున్న దగ్గు మందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉందని షా ట్విట్టర్లో వివరణ ఇచ్చాడు. అయితే, పృథ్వీ షా దురదృష్టవంతుడు లేదా అంత్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనలను తెలుసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహారించాడా? అనే అభిప్రాయాన్ని క్రికెట్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వాడా జాబితాలో ఉన్న నిషేధిక ఉత్ప్రేరకాల గురించి షా తెలుసుకోలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏం చేయాలో ఏం చేయకూడదో
నిజానికి నిషేధిక ఉత్ప్రేరకాల వాడేటప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో బీసీసీఐ యాంటీ డోపింగ్ కమిటీ కాంట్రాక్టు ఆటగాళ్ల నుంచి అందరికీ ముందుగానే తెలియజేస్తుంది. ఒక అంతర్జాతీయ ఆటగాడైన పృథ్వీ షా వాడా డాక్యుమెంట్స్ను కనీసం చదవకుండా నిషేధిక ఉత్ప్రేరకాన్ని తీసుకున్నాడా? దీంతో తన నిషేధానికి తన నిర్లక్ష్యమే కారణమని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పృథ్వీ షా క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ను కలిశాడని రాసుకొచ్చాయి.
పృథ్వీ షా తగినంతగా చేయలేదని
అందులో పూర్తి ఫిట్నెస్ను తిరిగి పొందడానికి పృథ్వీ షా తగినంతగా చేయలేదని, మైదానంలో క్రీడాకారుడి పనితీరును దెబ్బతీసే అలవాట్లను ఎంచుకున్నాడని... జట్టులోని సహచరులు సైతం ఇదే భావనలో ఉన్నారని అందులో రాసుకొచ్చాయి. అంతేకాదు పృథ్వీ షా తన సహచరుల ముందే స్మోకింగ్ చేస్తున్నాడని టీమిండియా ఇన్సైడర్స్ తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రాక్టీస్ గేమ్లో షాకు అయిన గాయం తీవ్రత లేకున్నప్పటికీ జట్టు మేనేజ్మెంట్ అతడిని ఇంటికి పంపింది. నిజానికి జట్టు మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అతడు కనిపించిన తీరేనని సమాచారం.
వినోద్ కాంబ్లీ మాదిరి కెరీర్ను నాశనం చేసుకుంటున్నాడా?
ఈ క్రమంలో షా కూడా వినోద్ కాంబ్లీ మాదిరి తన చేజేతులా కెరీర్ను నాశనం చేసుకుంటున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి నాళ్లలో సచిన్, కాంబ్లీలు అద్భుతమైన ప్రదర్శన చేశారు. కానీ, క్రమశిక్షణ విషయంలో కాంబ్లీ గాడితప్పడంతో తన క్రికెట్ కెరీర్ మధ్యలోనే ముగిసిపోయింది. ఈ విషయంలో పృథ్వీ షాను కూడా కాంబ్లీతో పోలుస్తున్నారు. షా నేతృత్వంలోని భారత జూనియర్ జట్టు అండర్-19 వరల్డ్ కప్ను గెలిచింది. దీంతో డజన్ల కొద్దీ ఎండార్స్మెంట్లు పృథ్వీ షా తలుపుతట్టాయి.
సక్సెస్ను నిలుపుకోవడంలో షా తడబాటు
అయితే, ఆ తర్వాత వచ్చిన తన సక్సెస్ను నిలుపుకోవడంలో షా తడబడ్డాడు. కాంబ్లీ విషయంలో కూడా ఇలానే జరిగింది. కెరీర్ తొలినాళ్లలో కాంబ్లీకి కూడా సక్సెస్ వచ్చింది. అయితే, దానిని నిలుపుకోవడంలో కాంబ్లీ పూర్తిగా విఫమలయ్యాడు. క్రికెట్లో మంచి ప్రదర్శన చేయడంతో పాటు క్రమశిక్షణ చాలా అవసరం. షాలో కూడా అదే లొపించిందని... దాని కారణంగా అతడు 8 నెలలు పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యాడని అంటున్నారు.
లేట్ నైట్ పార్టీలకు హాజరు
ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో కూడా పృథ్వీ షా ఎక్కువగా లేట్ నైట్ పార్టీలకు ఎక్కువగా హాజరయ్యాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుత భారత జట్టులో చోటు దక్కాలంటే ఎంతో కష్టం. చోటు దక్కినప్పటికీ దానిని నిలబెట్టుకోవాలంటే మెరుగైన ప్రదర్శన చేయాలి. అందుకు ఫిట్నెస్ ముఖ్యం. ఏది ఏమైనప్పటికీ 8 నెలలు నిషేధం అనేది పృథ్వీ షాకే కాదు ఇప్పుడిప్పుడే జట్టులోకి రావాలనుకుంటున్న ఎంతో మంది యువ క్రికెటర్లకు ఓ గుణపాఠం లాంటిది.