ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (PBKS) విజయయాత్ర కొనసాగుతోంది.ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా యువ సంచలనం ప్రభ్సిమ్రన్ సింగ్ తన అద్భుత బ్యాటింగ్తో జట్టును గెలిపించి, టీమ్ ఇండియా తలుపు తడుతున్నాడు.గురువారం (ఏప్రిల్ 16) జరిగిన మ్యాచ్ పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యంలో సాగింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 16.3 ఓవర్లలోనే ఊదేసింది. క్వింటన్ డి కాక్ శతక్కొట్టినా, ప్రభ్సిమ్రన్ అజేయ పోరాటం ముందు ముంబై తలవంచక తప్పలేదు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఆకాశమే హద్దుగా చెలరేగి 60 బంతుల్లోనే అజేయంగా 112 పరుగులు సాధించాడు.నమన్ ధీర్ (50)తో కలిసి రెండో వికెట్కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.చివర్లో హార్దిక్ పాండ్యా (14) మెరుపులు జోడించినా,పంజాబ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీసి ముంబైని కట్టడి చేశాడు.


196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలో తడబడినా,ప్రభ్సిమ్రన్ సింగ్ - కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జోడీ మ్యాచ్ రూపురేఖలను మార్చేసింది. వీరిద్దరూ కేవలం 67 బంతుల్లోనే 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.ప్రభ్సిమ్రన్ 39 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా...శ్రేయస్ అయ్యర్ 35 బంతుల్లో 66 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఐపీఎల్ పుణ్యమాని టీమిండియాకు ప్లేయర్ల కొరత అస్సలు లేకుండా పోయింది. ఒకప్పుడు జట్టు కూర్పు అనేది సెలెక్టర్లకు తలనొప్పిగా తయారయ్యేది. అయితే ఐపీఎల్లో లోకల్ టాలెంట్ బయటపడుతుండటంతో సెలెక్టర్లకు జట్టు ఎంపిక చాలా సులభతరంగా మారింది. ఇక ఈ సీజన్లో ప్రభ్సిమ్రన్ సింగ్ ప్రదర్శన చూస్తుంటే టీమ్ ఇండియాకు మరో బలమైన వికెట్ కీపర్ ఆప్షన్ దొరికినట్లు కనిపిస్తోంది. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఈ ఐపీఎల్లో ఆడిన 5 మ్యాచ్ల్లో 70.33 సగటుతో 211 పరుగులు చేశాడు.అతని స్ట్రైక్ రేట్ (172.95) అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బ్యాటింగ్లోనే కాకుండా వికెట్ల వెనుక కూడా మూడు మెరుపు క్యాచ్లతో చురుకుదనం ప్రదర్శించాడు.

ప్రభ్సిమ్రన్ సింగ్ను 2019లో పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ XI పంజాబ్) జట్టు తొలిసారిగా తీసుకుంది. ఆ తర్వాత 2022 వేలంలో అతడిని ₹60 లక్షలకు తిరిగి కొనుగోలు చేసింది.2023లో ఢిల్లీ క్యాపిటల్స్పై 103 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్లో 358 పరుగులు సాధించాడు.ఇక్కడే ప్రభ్సిమ్రన్ సింగ్ తలరాత మారిపోయింది. ఆ సీజన్లో తాను కనబర్చిన ప్రతిభ అతన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.2024లో 334 పరుగులు చేసిన అతడిని, 2025 మెగా వేలానికి ముందు పంజాబ్ ఏకంగా రూ. 4 కోట్లకు రిటెయిన్ చేసుకుంది.జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గత సీజన్లో 549 పరుగులు చేయడమే కాకుండా, ఈ సీజన్లోనూ ఓపెనర్గా జట్టుకు బలమైన పునాది వేస్తున్నాడు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరువవుతోంది. శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రన్ వంటి యువ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో వారి ప్రదర్శనే చెబుతోంది. ప్రభ్సిమ్రన్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే త్వరలోనే టీమ్ ఇండియా జెర్సీలో చూడటం ఖాయంగా కనిపిస్తోంది.