
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. దుబాయి వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను 27 పరుగుల తేడాతో ఓడించి.. నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. గతేడాది ఇదే చోట జరిగిన టోర్నీలో ఘోరంగా విఫలమైన ధోనీసేన .. సరిగ్గా ఏడాదిలో కప్పు కొట్టి విమర్శకుల నోళ్లు మూయించింది. సీఎస్కే కప్ కొట్టడంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారి సంబరాలకు అంతేలేకుండా పోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీ గెలవడంతో పండగ చేసుకుంటున్న ఎంఎస్ ధోనీ అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి త్రండ్రి కాబోతున్నాడని తెలుస్తోంది. ధోనీ సతీమణి సాక్షి సింగ్ ప్రస్తుతం గర్భవతి అని సమాచారం. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021 మ్యాచులు చూసేందుకు సాక్షి మైదానంకు వచ్చారు. ఆ సమయంలో ఆమె బేబీ బంప్తో కనిపించారు. చెన్నై ట్రోఫీ గెలిచిన అనంతరం మైదానంలో వచ్చిన సమయంలో కూడా సాక్షి బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాక్షి గర్భవతి అని ఫాన్స్ ట్వీట్స్ చేస్తూ.. కంగ్రాట్స్ చెపుతున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి సింగ్.. ఐపీఎల్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. తన భర్త టీమ్ చెన్నై సూపర్ కింగ్స్కు మద్దతు ఇస్తుంటారు. ప్రేక్షకుల మధ్య గ్యాలరీలో తెగ సందడి చేస్తుంటారు. దాంతో టీవీ కెమెరాలు పదేపదే సాక్షిని చూపించేవి. మహీ టీమిండియాకు ఆడిన సమయంలోనూ ఆమె మైదనంలో సందడి చేసేవారు. కరోనా కారణంగా భారత్లో జరిగిన తొలి దశకు సాక్షి దూరమైనా.. యూఏఈ జరిగిన రెండో దశలో సందడి చేశారు. సాక్షి సింగ్, ఎంఎస్ ధోనీ దంపతులకు జీవా అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే.
శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2021 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ .. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32), రాబిన్ ఉతప్ప (31), మొయిన్ అలీ (37) రాణించారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో కోల్కతా బాగానే ఆడినప్పటికీ.. వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్మన్ గిల్ (51) మినహా మిగిలిన బ్యాట్స్మెన్ తేలిపోయారు. గెలిచే మ్యాచును మోర్గాన్ సేన చేజేతులా కోల్పోవడంతో కప్పు చెన్నై కైవసం చేసుకుంది.