తొలి సెమీస్ మాంచెస్టర్లో..
ప్రపంచకప్ టోర్నమెంట్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ మంగళవారం మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. ఇందులో కోహ్లీసేన కేన్ విలియమ్సన్ టీమ్తో తలపడబోతోంది. ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో టీమిండియా ఆడే మూడో మ్యాచ్ ఇది. లీగ్ దశలో భారత జట్టు ఇదే స్టేడియంలో రెండు మ్యాచ్లను ఆడింది. ఆ రెండింట్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. కిందటి నెల 16వ తేదీన పాకిస్తాన్, భారత్ మధ్య ఇదే స్టేడియంలో మ్యాచ్ నిర్వహించారు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆ మ్యాచ్లో అయిదు వికెట్ల నష్టానికి 336 పరుగులను చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్తాన్ జట్టు 212 పరుగులకే చాప చుట్టేసింది డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం.. 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
వెస్టిండీస్పైనా గెలుపు..
లీగ్ మ్యాచ్లో భాగంగా టీమిండియా వెస్టిండీస్ను కూడా ఇదే పిచ్పై ఢీ కొట్టింది. ఆ మ్యాచ్నూ విజయం సాధించింది. ఈ సారి గెలుపు తేడా మరింత పెరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 268 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 143 పరుగులకు ఆలౌట్ అయింది. 125 పరుగుల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది కోహ్లీసేన. ఇక ముచ్చటగా మూడో మ్యాచ్ మంగళవారం న్యూజిలాండ్తో ఆరంభం కానుంది. నిజానికి- భారత్, న్యూజిలాండ్ మధ్య లీగ్ దశలోనే తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. దీనితో- ఈ ప్రపంచకప్లో ఈ రెండు జట్లు తొలిసారిగా ముఖాముఖి ఎదురు పడ్డాయి.
అచ్చి వస్తుందా?
ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో టీమిండియా గెలిచిన ఈ రెండు మ్యాచ్లు కూడా తొలుత బ్యాటింగ్ చేసినవే కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసి, ప్రత్యర్థికి లక్ష్యాన్ని నిర్దేశించి, మట్టి కరిపించినవే. ఈ నేపథ్యంలో- తొలి సెమీ ఫైనల్లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపించవచ్చు. పిచ్ పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు మారినప్పటికీ.. టీమిండియా టాస్ గెలిస్తే- తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాల్సి ఉంటుందని అప్పుడే క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.