హైదరాబాద్: శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపించాడు. ఫైనల్ మ్యాచ్లో భారత్ చేతిలో శ్రీలంక ఓడిన తీరుపై తాజాగా అనుమానం వ్యక్తం చేస్తూ రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఫైనల్ జట్టుని అప్పటి కెప్టెన్ కుమార సంగక్కర సమతూకంగా ఎంచుకోలేదని.. తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేయడం తనకి ఆశ్చర్యం కలిగించిందని రణతుంగ వెల్లడించాడు. త్వరలో పక్కా సాక్ష్యాలు వెల్లడిస్తానని రణతుంగ చెప్పాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్కి రణతుంగ కామెంటేటర్గా వ్యవహరించాడు.
'ఆ రోజు నేను భారత్లోనే ఉన్నాను. ఫైనల్లో శ్రీలంక ఓడిన తీరు నాకు చాలా బాధ కలిగించింది. తుది జట్టు ఎంపికపై నాకు చాలా అనుమానాలున్నాయి. అన్నీ ఆధారాలతో త్వరలోనే బయటపెడతా. కచ్చితంగా ఆ ఫైనల్పై విచారణ జరగాల్సిందే' అని రణతుంగ శుక్రవారం అన్నాడు.

2011 వరల్డ్ కప్ భారత్లోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ తర్వాత 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
తద్వారా 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ని మళ్లీ చేజిక్కించుకుంది. టోర్నీలో అప్పటి వరకు మెరుగ్గా రాణించిన మాథ్యూస్, హెరాత్, అజంతా మెండిస్, చమర సిల్వ స్థానంలో ఫైనల్ మ్యాచ్కి తిసారా పెరీరా, సురాజ్ రణదీవ్, కులశేఖర, కపుగెదరను కెప్టెన్ సంగక్కర తుది జట్టులోకి తీసుకున్నాడు.