
ఉద్దేశపూర్వకంగా కింద పడేసి:
ఆస్ట్రేలియా ఆటగాళ్లలా బాల్ టాంపరింగ్ కోసం ఇంగ్లండ్ ప్లేయర్స్ సాండ్ పేపర్ను ఉపయోగించలేదు. ఇంగ్లీష్ ప్లేయర్స్ ఈసారి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. నాలుగో రోజైన ఆదివారం భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా వాళ్లు షూస్ స్పైక్స్తో బంతిని తొక్కడం కెమెరా కంటపడింది. బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నారు. ఎవరో తెలియదు కానీ.. లంచ్ తర్వాత ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బంతిని అటు ఇటూ తంతూ దానిపై స్పైక్స్తో ముద్రలు వేయడం ఫొటోలు, వీడియోలో కనిపించింది. బంతిని ట్యాంపర్ చేసేందుకు ఇంగ్లీష్ బౌలర్లు మూడుసార్లు ప్రయత్నించినట్టు వెలుగులోకి వచ్చిన ఫొటోల ద్వారా తెలుస్తోంది.

ఇది బాల్ టాంపరింగా లేదా:
ఇంగ్లీష్ ప్లేయర్స్ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. 'ఇంగ్లీష్ ప్లేయర్స్.. అసలేం జరుగుతోంది. ఇది బాల్ టాంపరింగా లేదా కరోనా నివారణ చర్యా' అని ట్వీట్ చేశాడు. అంతేకాదు ఓ నవ్వుతున్న ఎమోజీని వీరూ జోడించాడు. 'ఇది బాల్ టాంపరింగే' అని భారత మాజీ ఓపెనర్, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనపై ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందిస్తూ... ఇది సాధారణం అని, ప్రమాదవశాత్తు బంతిని తన్ని ఉంటాడని, స్క్రీన్ షాట్ బదులుగా వీడియోను చూస్తే పూర్తిగా అర్ధమవుతుందని అంటున్నాడు.

అసలేం జరిగిందంటే::
విషయంలోకి వెళితే.. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు సహకరించింది. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా.. బంతిని స్వింగ్ చేయలేకపోయారు. దీనిని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (180 నాటౌట్) భారీ సెంచరీ బాదాడు. ఆదివారం ఉదయం బంతి కొంత స్వింగ్ కావడంతో ఇంగ్లండ్ బౌలర్లు మూడు వికెట్లను పడగొట్టారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరగానే ఔట్ అయ్యారు. ఆ తర్వాత తేమ తగ్గిపోవడంతో బంతి స్వింగ్కు అనుకూలించ లేదు. బంతి అంతంత మాత్రంగానే సహకరిస్తుండడంతో.. చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు క్రీజులో నిలదొక్కుకున్నారు.

100 పరుగుల భాగస్వామ్యం :
చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ భారత్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. చెత్త బంతులను మాత్రమే శిక్షిస్తూ పరుగులు చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరు ఎంతకూ ఔట్ కాకపోవడంతో.. ఇంగ్లీష్ బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేసి ఉంటారని అందరూ భావిస్తున్నారు. వీడియోలో బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నుతూ.. బూట్ల స్పైక్స్తో అదిమి తొక్కుతూ.. ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన భారత అభిమానులు ఉద్దేశపూర్వకంగా బాల్ టాంపరింగ్కి పాల్పడిన ఇంగ్లండ్ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కావాలనే చేస్తే:
టాంపరింగ్ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వివరణ ఇస్తుందో, లేదో చూడాలి. ప్రస్తుతానికైతే నాలుగో రోజు ఆట చక్కగా ముగిసింది. ఇది కచ్చితంగా బాల్ ట్యాంపరింగ్ ప్రయత్నమేనంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కావాలనే ఇంగ్లండ్ ప్లేయర్స్ టాంపరింగ్ చేశారని నిరూపితమైతే.. కఠిన చర్యలు తప్పవు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పడిన శిక్షే.. వీరికి కూడా పడనుంది. మరోవైపు ఈ ఘటనపై బీసీసీఐ కూడా స్పందించాల్సి ఉంది. దూకుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమంటాడో మరి.

ఉత్కంఠభరిత ముగింపు:
లార్డ్స్లో రెండో టెస్టు ఉత్కంఠభరిత ముగింపు దిశగా సాగుతోంది. అజింక్య రహానే (61; 146 బంతుల్లో 5×4), చేతేశ్వర్ పుజారా (45; 206 బంతుల్లో 4×4) పోరాడడంతో నాలుగో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ 82 ఓవర్లలలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (14 బ్యాటింగ్)కు తోడుగా ఇషాంత్ శర్మ (4) క్రీజులో ఉన్నాడు. భారత్ ప్రస్తుతం 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు ఇంగ్లండ్ మిగతా నాలుగు వికెట్లను చకచకా పడగొడుతుందా? లేదా భారతే చాలాసేపు బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా వైపు మళ్లిస్తుందా లేదా కోహ్లీసేన మరో 40-50 పరుగులకు ఆలౌటైతే, ఊరించే లక్ష్యం ఆతిథ్య జట్టు ముందు నిలిచి పోరు ఉత్కంఠభరితంగా ముగుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications












