IPL 2024 Chairman: ప్రస్తుతం దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో నవంబర్ 30వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో ఆ అయిదు చోట్లా ప్రచార జోరు పెరుగుతోంది.
ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ పోరు- వచ్చే ఏడాది నిర్వహించబోయే లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తోన్నాయి ప్రధాన పార్టీలన్నీ. సార్వత్రిక ఎన్నికల బలబలాలను బేరీజు వేసుకోవడానికి, ఎన్నికల ప్రణాళికలను రూపొందించుకోవడానికి- ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ పోరు దోహదపడతాయని భావిస్తోన్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడొచ్చు. దీని తరువాత దేశం మొత్తం కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ, అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి భారీగా భద్రత సిబ్బందిని ఉపయోగించాల్సి ఉంటుంది.
అదే ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్ కూడా ఆరంభమౌతుంది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే మెగా టోర్నమెంట్ ఇది. ఎన్నికలతో కలిసి ఐపీఎల్ టోర్నమెంట్ జరగడం దాదాపుగా ఖాయం కావొచ్చు. అటు ఎన్నికల సందడి, ఇటు ఐపీఎల్ 2024 మ్యాచ్ల నిర్వహణ అనేది కత్తి మీద సాములాంటిదే.
ప్రతి స్టేడియం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు, భద్రత సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. ఆటగాళ్లకూ అదే స్థాయిలో భద్రతను కల్పించాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికల విధి నిర్వహణల్లో ఉండే పోలీసు, భద్రత సిబ్బందికి ఇది కొంత ఆటంకంగా కలిగించవచ్చనే అంచనాలు ఇప్పటినుంచే వ్యక్తమౌతోన్నాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ మేనేజ్మెంట్.. ఈ టోర్నమెంట్ను భారత్లో నిర్వహించకపోవచ్చనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా ఇతర ప్రత్యామ్నాయ వేదికకు ఐపీఎల్ 2024 టోర్నమెంట్ను తరలించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తోన్నాయి.
దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా స్పందించారు. ఐపీఎల్ 2024ను ప్రత్యామ్నాయ వేదికలపై నిర్వహిస్తారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. ప్రత్యామ్నాయ వేదికలను చూడట్లేదని, భారత్లోనే ఐపీఎల్ 2024ను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 2014, 2019 సాధారణ ఎన్నికల సమయంలోనూ ఐపీఎల్ టోర్నమెంట్లు స్వదేశంలోనే ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు.