CSK vs RCB: ఐపీఎల్ 2024 సీజన్లో బోణీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. తొలి మ్యాచ్తోనే తన జైత్రయాత్రను ఆరంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తిరుగులేని విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
చెన్నై చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిపోయి తొలుత బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ధాటికి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ నిలవలేకపోయింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. ప్రారంభ ఓవర్లల్లో తడబడ్డ బౌలర్లు ఆ తరువాత రిథమ్ను అందిపుచ్చుకున్నారు. బెంగళూరు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ను కుప్పకూల్చారు.

నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెష్ట నష్టానికి ఆర్సీబీ 173 పరుగులు చేసింది. దీన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసింది. 15 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 37 పరుగులు బాదిన ఓపెనర్ రచిన్ రవీంద్ర టాప్ స్కోరర్. చివర్లో శివమ్ దుబే మెరుపు ఇన్నింగ్ ఆడాడు.
చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ మధ్య సాగిన ఈ పోరు ఈ సీజన్ ఛాంపియన్ ఎవరనేది అప్పుడే తేల్చేసింది కూడా. హిస్టరీ రిపీట్ అయిందీ అంటే ఈ సీజన్లో ఛాంపియన్గా నిలిచేది.. ముంబై ఇండియన్స్. తొలి మ్యాచ్లోనే టైటిల్ విన్నర్ను కూడా డిసైడ్ చేసినట్టవుతుంది.
2019లో ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లే తలపడ్డాయి. అప్పుడు కూడా గెలిచింది సూపర్ కింగ్సే. ఇప్పట్లాగే రాయల్ ఛాలెంజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి 70 పరుగులకే చాప చుట్టేశారు. ఓపెనర్ పార్థివ్ పటేల్ ఒక్కడే 29 పరుగులతో టాప్ స్కోరర్. మిగిలిన బ్యాటర్లెవరూ డబుల్ డిజిట్ కూడా అందుకోలేకపోయారు. 17.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి కొట్టేసింది సీఎస్కే.
ఇప్పుడు కూడా అలాంటి సీన్ కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తయింది రాయల్ ఛాలెంజర్స్ టీమ్. ఆ సీజన్లో టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్. హైఓల్టేజ్ ఫైనల్స్ మ్యాచ్ అది. ఒక్క పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ కప్ను ఎగరేసుకెళ్లింది. ఫైనల్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లల్లో 149 పరుగులు చేయగా.. చెన్నై ప్రస్థానం 148 పరుగుల వద్దే నిలిచిపోయింది.