మాస్క్లు వితరణ:
'వైరస్ రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. సమాజం కోసం మా వంతు కృషి చేస్తున్నాం. యువకులు ఏమైనా చేయాలనుకుంటే పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడండి. అయితే అందరూ కలిసి చేయకుండా.. సామాజిక దూరం పాటించండి. మేం చేసేది కేవలం చిన్న సాయం మాత్రమే. మన అందరి కోసం భవిష్యత్లో మరింత కృషి చేస్తాం' అని యూసుఫ్ పఠాన్ను ట్యాగ్ చేస్తూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.
బ్రదర్స్పై హర్షం:
పఠాన్ బ్రదర్స్ వారి తండ్రి నడుపుతున్న మొహ్మద్ఖాన్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట 4 వేల మాస్క్లు కొన్నామని ఇర్ఫాన్ తెలిపాడు. అన్నింటిని వడోదర ఆరోగ్య శాఖకు అందిస్తున్నామని వెల్లడించాడు. అవసరమైన వారికి ఆరోగ్యశాఖ మాస్క్లు పంపిణీ చేస్తారని తెలిపాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు పఠాన్ బ్రదర్స్పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇర్ఫాన్ ట్వీట్ను ఎంతోమంది షేర్ చేస్తూ.. లైకులు కొడుతున్నారు.
అమ్రిష్పురి పాత్రలో ఇర్ఫాన్:
కరోనా పుణ్యమాని పఠాన్ సోదరులు తమలోని కళా నైపుణ్యాలను కూడా ప్రదర్శించారు. ఆదివారం 'జనతా కర్ఫ్యూ' సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ తన సోదరుడు యూసుఫ్తో కలిసి ఓ వీడియో రూపొందించారు. పఠాన్ సోదరులు బాలీవుడ్ సినిమా 'సూర్య'లోని ఓ సన్నివేశాన్ని తీసుకొని అద్భుతంగా నటించారు. యూసుఫ్ పఠాన్ రాజ్కుమార్ పాత్రలో.. ఇర్ఫాన్ పఠాన్ అమ్రిష్పురి పాత్రలో ఆకట్టుకున్నారు.
మూడు ఫార్మాట్లలో 301 వికెట్లు:
ఇర్ఫాన్ పఠాన్ గత జనవరిలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 19 ఏళ్ల వయస్సులో 2003లో అరంగేట్రం చేసిన ఇర్పాన్.. భారత్ తరఫున తన కెరీర్లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి 301 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టెస్టుల్లో 1105 పరుగులు, వన్డేల్లో 1544 పరుగులు సాధించాడు. సుమారు తొమ్మిదేళ్ల పాటు ఇర్ఫాన్ భారత్ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.