న్యూఢిల్లీ: చెన్నై సూపర్కింగ్స్ అన్ని విభాగాల్లో బాగుందని, టోర్నీ గెలవాలంటే మాత్రం బౌలింగ్ ఇంకా మెరుగ్గా ఉండాలని టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఒత్తిడిలో ఆ జట్టులో వరుసగా ఆరు యార్కర్లు విసిరే పేసర్లే లేరని విమర్శించాడు. ముంబై చేతిలో పరాజయం తర్వాత అతను అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడాడు. ఈ మ్యాచ్లో చెన్నై ఓటమికి యార్కర్లు విసిరే పేసర్లు లేకపోవడమే కారమణమన్నాడు.
'కచ్చితంగా చెన్నై బౌలింగ్ మెరుగ్గా ఉండాలి. ముంబై మ్యాచ్లో అదే అనిపించింది. రోహిత్సేన చాలా బాగా బ్యాటింగ్ చేసింది. కానీ వాళ్ల షాట్లు గమనిస్తే బౌలింగ్ బాగాలేనట్టు అర్థమవుతుంది. యార్కర్లు విసిరే బౌలర్లు జట్టులో కచ్చితంగా ఉండాలి. కానీ చెన్నైలో మాత్రం అలాంటి పేసర్లు లేరు. ఒత్తిడిలో ఆరు యార్కర్లు విసిరే బౌలర్ను ఆ జట్టులో చూపించగలరా? ఆర్సీబీలో సిరాజ్, ముంబైలో బుమ్రా ఉన్నారు. పైగా బుమ్రాకు బౌల్ట్ తోడుగా ఉన్నాడు. ఢిల్లీలో రబాడా ఉన్నాడు.
ఆల్రౌండ్ పరంగా చెన్నై మంచి జట్టనడంలో సందేహం లేదు. వారికి 7-8 బౌలింగ్ వనరులు ఉన్నాయి. కానీ కఠినమైన పిచ్లపై పరుగులను కాపాడుకొనే ఒకరిద్దరు బౌలర్లైనా లేరు. ముంబై మ్యాచులో బంతి తడవలేదు. బంతి తడిచిందంటే యార్కర్లు విసరడం చాలా కష్టం. సామ్ కరన్ కొన్ని యార్కర్లు విసిరాడు. కానీ అతడి ఓవర్ తర్వాత మరెవ్వరూ యార్కర్లు సరిగ్గా విసరలేదు. సీఎస్కే టోర్నీ గెలవాలంటే బౌలర్లు కచ్చితంగా రాణించాల్సిందే' అని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు.
ముంబై ఇండియన్స్తో జరిగిన హై స్కోరింగ్ హై ఓల్టేజ్ మ్యాచ్లో ధోనీ సేన ఆఖరి బంతికి 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కీరన్ పొలార్డ్(34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్) విధ్వంసం ముందు చెన్నై బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 రన్స్ చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 72 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 50), మోయిన్ అలీ(36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 58) ధాటిగా ఆడారు. అనంతరం ముంబై పొలార్డ్ వీరోచిత పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో మొత్తం 30 సిక్స్లు, 30 ఫోర్లు నమోదయ్యాయి.