
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో చివరికి 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత రాజస్థాన్ రాయల్స్ను 20ఓవర్లలో 158/6 స్కోరుకే ముంబై పరిమితం చేసింది. ఇక ఛేజింగ్కు దిగిన ముంబై.. అనంతరం 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 161పరుగులు చేసి ఈ టోర్నీలో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్(39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. తిలక్ వర్మ(30 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 35), టీమ్ డేవిడ్(20 నాటౌట్)లు కీలక ఇన్నింగ్స్లు ఆడి ముంబైకి తొలి గెలుపు రుచి చూపించారు.
ఈ మ్యాచ్లో ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో మూడో ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. ఏడో ఓవర్లో శాంసన్ డారిల్ మిచెల్కు బౌలింగ్ ఇచ్చాడు. మిచెల్ ఆ ఓవర్లో చెత్త బౌలింగ్ వేశాడు. ఏకంగా ఆ ఓవర్లో ముంబై బ్యాటర్లు 20పరుగులు పిండుకున్నారు. ఇదే మ్యాచ్ను మలుపు తిప్పిన ఓవర్గా మారిపోయింది. అసలు పటిష్ఠమైన బౌలింగ్ యూనిట్ ఉన్నప్పుడు శాంసన్ డారిల్ మిచెల్కు బౌలింగ్ ఇవ్వడాన్ని క్రికెట్ ప్రముఖులు విమర్శిస్తున్నారు. శాంసన్ డారెన్ మిచెల్కు ఆ ఓవర్లో బౌలింగ్ ఇవ్వడాన్ని భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ శాంసన్ తప్పుపట్టాడు.
"డారిల్ మిచెల్ను సంజూ శాంసన్ 7వ ఓవర్లో బౌలింగ్ చేయించడం వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. మరో వైపు స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తన 4ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయలేదు.' అని పఠాన్ ట్వీట్ చేశాడు. అప్పటికే ముంబై బ్యాటర్లు తడబడుతూ బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో బౌలింగ్ వనరులు పుష్కలంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టులోని సమర్థులైన బౌలర్ల చేత పూర్తి కోటా బౌలింగ్ చేయించాల్సిందిగా పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఆ ఓవర్లో 20పరుగులకు బదులు 10పరుగుల లోపు వచ్చి ఉంటే మ్యాచ్ స్వరూపమే వేరేగా ఉండేదని పఠాన్ అభిప్రాయమని తెలుస్తోంది. ఇక ముంబై బౌలింగ్ విషయాని కొస్తే రిలే మెరెడిత్ (2/24), కుమార్ కార్తికేయ (1/19), హృతిక్ షోకీన్ (2/47) మంచి ప్రదర్శన కనబరిచారు. డానియల్స్ సామ్స్ కూడా 4ఓవర్లలో 1/32 ప్రదర్శన చేయడంతో రాయల్స్ 158పరుగులకే పరిమితం అయింది. దీంతో ముంబై ముందు ఛేదించగల టార్గెట్ ఏర్పడింది.