స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురింపించాడు. పుష్కరకాలం నుంచి రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లి తన ఆటను మరింత మెరుగుపర్చుకోవడం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటున్నాడని ఇర్ఫాన్ అన్నాడు. ఆట పట్ల కోహ్లికి ఉన్న ఈ తపనే ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా తీర్చిదిద్దిందని కొనియాడాడు.
ఐపీఎల్-2024 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ను ధరించాడు. 13 మ్యాచ్ల్లో 66 సగటుతో 661 పరుగులు చేశాడు. 155 స్ట్రైక్రేటుతో రన్స్ సాధిస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులకు ముందు కోహ్లి స్ట్రైక్రేటుపై మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. పవర్ప్లే అనంతరం కోహ్లి ఆట స్లోగా మారుతుందని, స్పిన్లో వేగంగా పరుగులు సాధించలేకపోతున్నాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సహా మరికొందరు మాజీలు కామెంట్లు చేశారు.

ఈ విమర్శలకు కోహ్లి బ్యాటుతో పాటు నోటితోనూ బదులిచ్చాడు. కామెంటరీ బాక్స్లో కూర్చోవడం, బరిలోకి దిగి పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం ఒక్కటి కాదని అన్నాడు. క్వానిటీ కంటే క్వాలిటీని ఇష్టపడతానని కోహ్లి ఘూటుగా రిప్లై ఇచ్చాడు. అంతేగాక ఆ తర్వాత నుంచి స్పిన్లో సిక్సర్లు, బౌండరీలు బాదుతూ హోరెత్తిస్తున్నాడు. దూకుడుగా పరుగులు చేస్తూ విమర్శకులకు సమాధానమిస్తున్నాడు.

దీనిపై ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ''అందుకే కోహ్లి ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా నేను భావిస్తున్నా. ఎన్నో ఏళ్లు గడుస్తున్నా తన ఆటను మరింత మెరుగుపర్చుకుంటూనే ఉన్నాడు. గతంలో అతను స్వీప్ షాట్ ఆడలేదు. అయితే కోహ్లి స్వీప్ షాట్ ఆడడని, అందుకే స్పిన్లో స్టంప్స్, ప్యాడ్కు వచ్చే బంతులు ఎడ్జ్ తీసుకుంటాయని ప్రజలు విమర్శించారు. ఆ తర్వాత కోహ్లి ఏం చేశాడు? ముందుకు వచ్చి స్లాగ్ స్వీప్, నార్మల్ స్వీప్ షాట్లు ఆడుతూ స్ట్రైక్రేటును పెంచుకున్నాడు'' అని పఠాన్ అన్నాడు. గుజరాత్, పంజాబ్తో జరిగిన మ్యాచ్ల్లో స్పిన్లో కోహ్లి భారీ సిక్సర్లు సాధించాడు.