
ముంబై: టీ20 ప్రపంచ కప్ మెగా క్రికెట్ టోర్నమెంట్..ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి ఆస్ట్రేలియా దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే మెగా ఈవెంట్ ఇది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఇందులో భాగంగా క్రికెట్ ఆడే అన్ని దేశాలకు ఐసీసీ కొన్ని కీలక సూచలను కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 15వ తేదీ నాటికంతా తమ ప్లేయర్ల వివరాలను అందజేయాలంటూ ఐసీసీ సూచించింది.
మొత్తం 45 మ్యాచ్ల టోర్నమెంట్ ఇది. తొలి మ్యాచ్ అక్టోబర్ 16వ తేదీన ఆరంభమౌతుంది. శ్రీలంక నమీబియా తలపడతాయి. సూపర్ 12లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 23వ తేదీన షెడ్యూల్ అయింది. నవంబర్ 13వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అంతకంటే ముందు- అన్ని జట్లూ టీ20 మ్యాచ్లను ఆడుతున్నాయి. సిరీస్ల మీద సిరీస్లను షెడ్యూల్ చేసుకున్నాయి.
భారత్ కూడా టీ20 సిరీస్లను ఆడుతోంది. దక్షిణాఫ్రికాతో అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ముగించుకుంది. ఇదే నెలలోనే ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్లను ఆడబోతోంది. అనంతరం ఇంగ్లాండ్లో ఆ దేశ జట్టుతో మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్లో తలపడుతుంది. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి.

అనంతరం రెండు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. 12వ తేదీన ఓవల్, 14న లార్డ్స్లో ఈ రెండు మ్యాచ్లల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడతాయి. ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు అటు నుంచి అటే వెస్టిండీస్కు బయలుదేరి వెళ్తుంది. మూడు వన్డే ఇంటర్నేషనల్స్, అయిదు టీ20 మ్యాచ్లను ఆడుతుంది. జులై 22వ తేదీన తొలి వన్డే ఆరంభమౌతుంది. ఆగస్టు 7వ తేదీ వరకు ఈ సిరీస్ ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. తన తుదిజట్టును ఎంపిక చేశాడు. జట్టు కూర్పు ఇలా ఉంటే ఈ మెగా ఈవెంట్లో రాణించగలమని అంచనా వేశాడు. ఇర్ఫాన్ ఎంపిక చేసిన జట్టులో రిషభ్ పంత్కు చోటు దక్కలేదు. అతనికి బదులుగా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ను సెలెక్ట్ చేశాడు పఠాన్.
ఆస్ట్రేలియా పిచ్లపై ఆడటానికి అనుభవజ్ఞుడైన ప్లేయర్ అవసరం అని చెప్పాడు. రిషభ్ కంటే మెరుగ్గా డీకే స్వింగ్, సీమ్ బౌలింగ్ను ఎదుర్కొంటాడని చెప్పాడు. అతను ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.