Irfan Pathan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం కీలక పోరు జరగనుంది. దాయాది పోరులో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించగా.. పాకిస్థాన్ మాత్రం న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ లో పాక్ పైనా గెలిచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకునే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది. పాకిస్థాన్ కు ఇది కీలక మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ఓటమి పాలైతే పాకిస్థాన్ ఇంటిముఖం పట్టాల్సిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ కంటే టీమిండియానే ఈ మ్యాచ్ లో ఫేవరేట్ అంటూ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ జట్టులో చాలా సమస్యలు ఉన్నట్లు తెలిపాడు.
దాయాది జట్టులో సీనియర్ల ఆట అంతగా ఏమీ లేదని.. ప్రస్తుతం మోడర్న్ డే క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్నారని అన్నారు. పాకిస్థాన్ ఆటగాళ్ల ఆటతీరును న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గమనించామని.. పాక్ ఆటగాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్ లో వెనకబడ్డారని పేర్కొన్నాడు. భారత్ తో పోరులోనైనా పాక్ ఆటగాళ్లు మారుతారా.. అంటే చెప్పడం కష్టమేనన్నాడు. ఇక్కడ బలాలు, బలహీనతల కంటే భారత్-పాక్ మధ్య పోరు అనే భావోద్వేగం ప్రభావం చూపించడం మాత్రం ఖాయమన్నాడు. ఆ భావోద్వేగాన్ని ఎవరు సరిగ్గా హ్యాండిల్ చేస్తారో.. ఆ జట్టు గెలుస్తుందని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.

ఇటీవల భారత్ ఆడిన మ్యాచ్ లను గమనిస్తే.. టాలెంట్ పరంగా ఆందోళన అనేదే లేదన్నాడు. టీ20, వన్డే క్రికెట్ లో అద్భుతమైన క్రికెటర్లు జట్టులో ఉన్నారన్నారు. తొలి మ్యాచ్ లోనే మహ్మద్ షమీ 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడన్నారు. ఐసీసీ టోర్నీల్లో మహ్మద్ షమీ అదరగొట్టేస్తాడని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లు గాయం నుంచి కోలుకుని రాణించడం కష్టమే కానీ.. షమీ అద్బుతాన్ని చేశాడన్నారు. టీమిండియాలో మంచి ఆల్ రౌండర్లు ఉన్నారన్నారు. అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ ప్రదర్శన, శుభ్ మన్ గిల్ ఫామ్.. మరోవైపు రోహిత్, విరాట్ నిలకడగా రన్స్ రాబడితే టీమిండియాను ఆపడం ఎవరితరం కాదని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.