ఫాస్ట్ బౌలర్లపై ఇర్ఫాన్ ఆందోళన:
ఇక లాక్డౌన్ కారణంగా దాదాపు 4 నెలల నుంచి క్రికెటర్లంతా ఇళ్లకే పరితమైపోయిన విషయం తెలిసిందే. దీంతో వారంతా ప్రాక్టీస్కు పూర్తిగా దూరమైపోయారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా తిరిగి మునుపటి ఫాంను సాధించాలంటే కొన్ని వారాల సమయమైనా పడుతుంది. అందులోనూ ఫాస్ట్ బౌలర్ల విషయంలో మరింత సమయం పట్టే అవకాశం ఉందని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇర్ఫాన్ పఠాన్ తాజాగా క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఫాస్ట్ బౌలర్లపై ఆందోళన వ్యక్తం చేశాడు.
శరీరం పట్టు కోల్పోతుంది:
'సాధారణంగా ఏ దేశ క్రికెట్ జట్టుకైనా కేవలం 2 నుంచి 3 వారాల సెలవు మాత్రమే దొరుకుతుంది. కానీ వైరస్ కారణంగా ఆటగాళ్లకు దాదాపు 4 నెలల విశ్రాంతి దొరింకింది. ఈ 3-4 నెలలూ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఆటగాళ్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే స్పిన్నర్లు, బ్యాట్స్మెన్లు 3 వారాల సమయంలో తిరిగి ఫిట్నెస్ సాధించగలుగుతారు. కానీ ఫాస్ట్ బౌలర్లు అలాకాదు. ఫాస్ట్ బౌలర్లు 140-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుంటారు. అలాంటి వారు ఇన్ని నెలలు ఖాళీగా ఉండడంతో శరీరం సహకరించదు' అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
అందరి కన్నా వాళ్లే జాగ్రత్తగా ఉండాలి:
'ఫాస్ట్ బౌలర్లు ఒక్కసారిగా ప్రాక్టీస్ చేయడంతో గాయాలపాలయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అంతేకాకుండా వారు మునుపటి స్థాయిని అందుకునేందుకు కనీసం 4 నుంచి 6 వారాలు అవసరం కావచ్చు. అందువల్ల పేసర్లందరూ జాగ్రత్తగా ఉండాలి. స్పిన్నర్లు, బ్యాట్స్మన్ కన్నా పేసర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి' ఇర్ఫాన్ సలహా ఇచ్చాడు. కరోనా గురించి మాట్లాడుతూ.. ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉన్నని రోజులు బౌలర్లకు కష్టమని వెల్లడించాడు. అంతర్జాతీయ కెరీర్లో పఠాన్ 28 టెస్టుల్లో, 120 వన్డేల్లో, 24 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
గత జనవరిలో రిటైర్మెంట్:
ఇర్ఫాన్ 2003లో టీమిండియాకు ఎంపికై.. ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడాడు. తర్వాత పాకిస్థాన్పై టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఒక్కసారిగా హీరో అయ్యాడు. బ్యాట్తోనూ పలు సందర్భాల్లో మంచి పరుగులు సాధించాడు. భారత్ తరఫున 29 టెస్టులాడిన ఇర్ఫాన్ 100 వికెట్లు తీశాడు. 120 వన్డేల్లో 173 వికెట్లు పడగొట్టాడు. 2012లో చివరిసారి టీమిండియాకు ఆడిన ఇర్ఫాన్.. తర్వాత జమ్మూ కశ్మీర్ తరఫున దేశవాళీ క్రికెట్లో కొనసాగాడు. చివరకు ఈ ఏడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.