ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా సాధించిన అద్భుతమైన విజయం అనంతరం పాక్ జట్టుపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ పాకిస్థాన్ జట్టును తీవ్రంగా ఏకిపారేశారు. ఈ వ్యాఖ్యలు తరచూ భారత జట్టుపై విమర్శలు చేసే షాహిద్ అఫ్రిదికి గట్టి సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పాకిస్థాన్ స్థాయి భారత దేశీయ జట్ల కంటే తక్కువ
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్ పాకిస్థాన్ జట్టు బలహీనతను ఎత్తి చూపారు. భారతదేశంలో ఉన్న చాలా డొమెస్టిక్ జట్లు.. ఉదాహరణకు ముంబై, పంజాబ్ వంటి జట్లు కూడా పాకిస్థాన్ జట్టును ఓడించగలవని ఆయన అన్నారు. అంతే కాకుండా చాలా ఐపీఎల్ జట్లు కూడా పాకిస్థాన్ ను ఈజీగా ఓడించగలవని పేర్కొన్నారు. ఈ కామెంట్స్తో పాకిస్థాన్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడడానికి ఇంకా చాలా మెరుగుపడాల్సిన అవసంరం ఉందని ఇర్ఫాన్ పఠాన్ సూచించారు.

దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి పాకిస్థాన్ జట్టును కేవలం 127 పరుగులకే కట్టడి చేశారు. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్లో షాహీన్ అఫ్రిది మినహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అనంతరం భారత బ్యాటర్లు లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించి విజయఢంకా మోగించారు. అభిషేక్ శర్మ తొలి రెండు బంతుల్లోనే 10 పరుగులు చేసి మ్యాచ్ పై తమ పట్టును చూపించారు. ఈ గెలుపు భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచగా.. పాకిస్థాన్ జట్టు తమ ఆటతీరుపై ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.