హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్లు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. వీరు చేసిన పోస్టులు ఇస్లాంకు వ్యతిరేకమంటూ కొందరు ముస్లిం అభిమానులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సోమవారం రక్షాబంధన్ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ చేతికి రాఖీ కట్టుకొని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపాడు.
ఇర్ఫాన్ పఠాన్ చేసిన పోస్టుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నువ్వు అసలు ముస్లింవేనా అని, రాఖీ పండుగ ఇస్లాంకు వ్యతిరేకమని అభిమానులు కామెంట్స్ పోస్టు చేశారు. అయితే కొందరు ముస్లిం అభిమానులు మాత్రం ఇర్ఫాన్ పఠాన్ని సమర్థిస్తూ కామెంట్స్ చేయడం గమనార్హం.
మరోవైపు మహ్మద్ కైఫ్ మాత్రం రాఖీ కట్టుకున్న ఫొటోను పోస్ట్ చేయలేదు గానీ రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పాడు. తమ చెల్లితో మిగితావాళ్లు ఎలా ఉండాలని మనం అనుకుంటామో.. మనమూ అలాగే ఉండాలి అంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పాడు కైఫ్.
అయితే దీనిపై ఫత్వా జారీ అవుతుంది జాగ్రత్త అంటూ కొందరు ఫ్యాన్స్ కైఫ్ను హెచ్చరించారు.