

హైదరాబాద్: అంతా ఊహించినట్లుగానే కోహ్లీసేన ఐర్లాండ్పై విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టించిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూ.. చివరికి విజయాన్ని సాధించింది. అయితే ఈ విషయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీని అడగ్గా.. ఐర్లాండ్తో రెండో టీ20తో పాటు ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లోనూ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులుంటాయని స్పష్టం చేశాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... 'ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఐర్లాండ్ చివరి ఓవర్ చాలా బాగా వేసింది. రోహిత్, ధావన్ కారణంగానే భారత్ మంచి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ధోనీ, రైనా, పాండ్య దూకుడుగా ఆడారు. ఇక బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందరూ చాగా రాణించారు' అని తెలిపాడు.
అనంతరం బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు గురించి అడగ్గా.. 'బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులుంటాయని గతంలోనే చెప్పాను. టీ20ల్లో ఓపెనర్లు మినహా మిగతా అందరి బ్యాటింగ్ ఆర్డర్లో తప్పక మార్పులు చూస్తారు. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్కు అవకాశం ఇవ్వాలన్న యోచనతోనే ఈ మార్పులు చేశాం. అంతేకాదు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులతో ప్రత్యర్థి జట్టును తికమకకు గురిచేయాలన్నది కూడా మా ప్రణాళికలో ఓ భాగం. తొలి టీ20లో ఆడకుండా బెంచ్కు పరిమితమైన ఆటగాళ్లకు శుక్రవారం జరిగే రెంటో టీ20లో అవకాశం ఇస్తాం' అని కోహ్లీ తెలిపాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ ఎప్పుడూ మూడో స్థానంలో వచ్చేవాడు. అలాంటిది ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో ఆరో స్థానంలో వచ్చాడు. అయితే పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపట్టాడు. అంతకుముందు మూడో స్థానంలో రైనా, నాలుగులో ధోనీ, ఐదులో హార్దిక్ పాండ్య బ్యాటింగ్కు దిగారు.