పాకిస్థాన్కు ఐర్లాండ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. డబ్లిన్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో అయిదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. టీ20ల్లో పాక్పై ఐర్లాండ్కు ఇదే తొలి విజయం. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 182 పరుగులు చేసింది.
బాబర్ అజామ్ (57; 43 బంతుల్లో, 8x4, 1x6), సయిమ్ అయుబ్ (45; 29 బంతుల్లో, 4x4, 3x6) టాప్ స్కోరర్లు. ఇఫ్తికర్ అహ్మద్ (37; 15 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. మహ్మద్ రిజ్వాన్ (1), అజామ్ ఖాన్ (డకౌట్), షాదాబ్ ఖాన్ (డకౌట్) విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ (2/27) రెండు వికెట్లతో సత్తాచాటాడు.

అనంతరం ఛేదనలో ఐర్లాండ్ 19.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ ఆండీ బాల్బిర్నీ (77; 55 బంతుల్లో, 10x4, 2x6) విజయంలో కీలక పాత్ర పోషించాడు. హ్యారీ టెక్టర్ (36; 27 బంతుల్లో, 3x4, 1x6), జార్జ్ డాక్రెల్ (24; 12 బంతుల్లో, 2x4, 2x6) రాణించారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిదీ (2/36) రెండు వికెట్లు తీశాడు.
కాగా, మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్కు వరుసగా షాక్లు తగులుతున్నాయి. గత నెలలో సొంతగడ్డపై న్యూజిలాండ్ ద్వితీయ శ్రేణీ జట్టులో పాక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తాజాగా ఐర్లాండ్ చేతిలో పాకిస్థాన్ కంగుతింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. టీ20 వరల్డ్ కప్లోని గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, కెనడా, యూఎస్ఏతో పాటు ఐర్లాండ్ కూడా ఉంది.
దీంతో పాకిస్థాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టీ20 ప్రపంచకప్లో సత్తాచాటాలని జట్టులో పాక్ క్రికెట్ బోర్డు చేసిన మార్పులు సత్ఫలితాన్ని ఇవ్వట్లేదు. బాబర్ అజామ్కు తిరిగి కెప్టెన్సీ ఇవ్వడం, వైట్ బాల్ టీమ్కు కోచ్గా గ్యారీ కిర్స్టన్ పాక్ బోర్డు నియమించిన విషయం తెలిసిందే. కానీ పాకిస్థాన్ అనూహ్య ఓటములు చవిచూస్తోంది. కాగా, మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో పాక్ రెండో మ్యాచ్ను ఆదివారం ఆడనుంది.