అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన రికార్డును ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బద్ధలు కొట్టారు. క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా పాల్ స్టిర్లింగ్ అగ్రస్థానానికి చేరుకున్నారు. దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్తో పాల్ స్టిర్లింగ్ ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 159 మ్యాచ్లతో ఈ రికార్డును తన వద్ద ఉంచుకోగా.. తాజాగా పాల్ స్టిర్లింగ్ తన 160వ మ్యాచ్ ఆడి సరికొత్త రికార్డును నెలకొల్పారు.
అత్యధిక టీ20లు ఆడిన టాప్-5 ప్లేయర్లు వీరే..
*పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్ )- 160
*రోహిత్ శర్మ (భారత్)- 159
*జార్జ్ డాక్రెల్(ఐర్లాండ్)-153
*మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్)-148
*జోస్ బట్లర్(ఇంగ్లాండ్)- 144

తొమ్మిదోసారి ప్రపంచకప్కు సిద్ధం
2009లో అరంగేట్రం చేసిన పాల్ స్టిర్లింగ్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్లో తన తొమ్మిదో మెగా టోర్నీని ఆడనున్నారు. తద్వారా రోహిత్ శర్మ, షకీబ్ అల్ హసన్ తర్వాత అత్యధిక వరల్డ్ కప్లు (9) ఆడిన మూడో ఆటగాడిగా ఆయన నిలవనున్నారు.
పరుగుల వేటలోనూ టాప్!
కేవలం మ్యాచ్ల సంఖ్యలోనే కాకుండా, పరుగుల పరంగా కూడా స్టిర్లింగ్ సత్తా చాటుతున్నారు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన 4వ బ్యాటర్గా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన 160 మ్యాచ్ల్లో 3874 పరుగులు సాధించారు. కేవలం బాబర్ ఆజమ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ఆయన కంటే ముందున్నారు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక మ్యాచ్ల రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా.. టీ20ల్లో ఆ గౌరవం ఇప్పుడు పాల్ స్టిర్లింగ్కు దక్కింది.