అతిథ్య జట్టు వెస్టిండీస్కు ఐర్లాండ్ షాకిచ్చింది. జమైకా వేదికగా విండీస్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఐరీష్ టీం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నెల 11 వ తేదీనే ఈ మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఐర్లాండ్ జట్టు ఆటగాళ్లకు కరోనా సోకడంతో రీషెడ్యూల్ చేసి 13న నిర్వహించారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 48 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. రొమారియో షెపర్డ్ (41 బంతుల్లో 50 పరుగులు..7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
స్మిత్ 46, బ్రుక్స్ 43 పరుగులతో పర్వాలేదనిపించారు. హోప్ 17, చేజ్ 13, హోసేన్ 11 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్ ఆండీ మెక్బ్రైన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. క్రెయిగ్ యంగ్ 3, జాషువా లిటిల్ 2, డాక్రెల్ ఒక వికెట్ తీశారు. ఇక ఆ తర్వాత వర్షం రావడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ ఇన్నింగ్స్ను 36 ఓవర్లకు కుదించి 168 పరుగుల లక్ష్యాన్ని అప్పగించారు.
లక్ష్య చేధనలో ఐర్లాండ్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 15 బంతుల్లోనే 21 పరుగులు చేసిన ఆ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్.. హోసేన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అనంతరం జట్టు స్కోర్ 60 పరుగుల వద్ద ఉండగా.. 26 పరుగులు చేసిన విలియం పోర్టర్ఫీల్డ్ను రోస్టన్ చేజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఆండీ మెక్బ్రైన్, హ్యారీ టెక్టర్ కలిసి మూడో వికెట్కు 44 పరుగులు జోడించారు.
ఈ క్రమంలో జట్టు స్కోర్ 104 పరుగుల వద్ద ఉండగా 35 పరుగులు చేసిన ఆండీ మైక్బ్రైన్ను రొమారియో షెపర్డ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో వికెట్కు కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 157 పరుగుల వద్ద ఉండగా 12 పరుగులు చేసిన కర్టిస్ కాంఫర్, హోసేన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఆ కాసేపటికే జట్టు స్కోర్ 165 పరుగుల వద్ద ఉండగా 5 పరుగులు చేసిన జార్జ్ డాక్రెల్ను విండీస్ కెప్టెన్ పొలార్డ్ ఔట్ చేశాడు. అయితే అప్పటికే ఐర్లాండ్ విజయానికి చేరువైంది. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన హ్యారీ టెక్టర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఐర్లాండ్కు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
4 వికెట్లతో సత్తా చాటిన ఐర్లాండ్ బౌలర్ ఆండీ మెక్బ్రైన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో రెండు వన్డేలు ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. కాగా సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే మ్యాచ్ ఈ నెల 16న జరగనుంది.