
37 ఏళ్ల ఐర్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విలియం పోర్టర్ఫీల్డ్ అన్నిరకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్లో 148 వన్డేలు, 61 టీ20లు, 3 టెస్టు మ్యాచ్లు ఆడాడు. పోర్టర్ఫీల్డ్ ఐర్లాండ్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడి మూడో ప్లేయర్ కాగా, అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 5000కంటే ఎక్కువ పరుగులు చేసి ఐర్లాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో రెండోస్థానంలో నిలిచాడు. పోర్టర్ఫీల్డ్ చివరిగా జనవరిలో ఐర్లాండ్ తరఫున ఆడాడు. జనవరిలో వెస్టిండీస్తో జరిగిన 3-మ్యాచ్ల వన్డే సిరీస్లో 2-1తేడాతో ఐర్లాండ్ సిరీస్ గెలిచింది. తద్వారా పోర్టర్ ఫీల్డ్కు విజయంతో ఫేర్ వెల్ అందనుంది. పోర్టర్ఫీల్డ్ తన చివరి మ్యాచ్లో డకౌట్ అయ్యాడు.
పాకిస్థాన్కు, ఇంగ్లాండ్కు ఝలక్ ఇచ్చిన ఐర్లాండ్
2018లో పాకిస్తాన్తో జరిగిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్కు, ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరిగిన టెస్ట్ మ్యాచ్కు ఐర్లాండ్ కెప్టెన్గా పోర్టర్ ఫీల్డ్ వ్యవహరించాడు. ఇక పోర్టర్ఫీల్డ్ ఐర్లాండ్ను రెండుసార్లు వన్డే ప్రపంచకప్ క్యాంపెయిన్లలో నిలిపాడు. 5సార్లు టీ20 ప్రపంచ కప్లలో ఐర్లాండ్ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. 2007 ప్రపంచకప్లో పాకిస్థాన్ను, 2011 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ను ఐర్లాండ్ ఆశ్చర్యకరంగా ఓడించింది. ఆ రెండుసార్లు పోర్టర్ఫీల్డ్ జట్టులో ప్లేయర్గా ఉన్నాడు. 2015ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో పోర్టర్ఫీల్డ్ సెంచరీ బాదాడు.
ఇక కోచ్గా బాధ్యతలు చేపట్టడానికి..
'నా కెరీర్ ప్రారంభంలో మేము ఓ ఔత్సాహిక జట్టుగా ఉన్నాము. ఇప్పుడు మేము టెస్ట్ హోదా పొందిన దేశంగా మారాం. నాకంటే ముందు జట్టుకు సేవ చేసిన వారి నుంచి నేను కొంత నేర్చుకుని నా ఈ క్రికెట్ ప్రయాణంలో ఐర్లాండ్లో క్రికెట్ అభివృద్ధి చెందడానికి ఓ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నా. నేను ఎప్పుడూ చేయాలనుకునేది మా జెర్సీని ప్రపంచ క్రికెట్లో ఉత్తమంగా ఉంచాలనుకోవడం, ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మాకంటూ ఓ స్థానం ఏర్పడింది. ఈ విషయంలో నేను కీలక పాత్ర పోషించానని భావిస్తున్నా' అని పేర్కొన్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 212 మ్యాచ్లు ఆడిన పోర్టర్ ఫీల్డ్ 11సెంచరీలతో కలిసి 5480పరుగులు చేశాడు. ఇప్పుడు అతను కోచ్ గా అవతారమెత్తడానికి సిద్ధమవుతున్నాడు.