హైదరాబాద్: ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా విజయం దిశగా సాగుతోంది. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో వృద్ధిమాన్ సాహా 214 పరుగుల్లో 16 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 123 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. 379 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్టాఫ్ ఇండియా నాలుగో రోజైన సోమవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 266 పరుగులు చేసింది.
సాహాతో పాటు రెస్టాఫ్ ఇండియా కెప్టెన్ ఛటేశ్వర్ పుజారా 83 పరుగులతో క్రీజులో ఉన్నారు. 379 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్టాఫ్ ఇండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు హెర్వాద్కర్ (20), ముకుంద్ (19)లతో పాటు కరుణ్ నాయర్ (7), మనోజ్ తివారి (7) పరుగులకే పెవిలియన్కు చేరారు.

ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన సాహా, ఛటేశ్వర్ పుజారా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 203 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో రోజైన సోమవారం చివరకు 266/4తో నిలిచింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 227/8తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన గుజరాత్ తమ రెండో ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది.
చివరిరోజైన మంగళవారం రెస్టాఫ్ ఇండియా ఇంకా 113 పరుగులు సాధిస్తే ఇరానీ ట్రోఫీ సొంతం చేసుకుంటుంది. గాయంతో ఇంగ్లాండ్తో జరిగిన చివరి మూడు టెస్టులకు దూరమైన వృద్ధిమాన్ సాహా ఇరానీ మ్యాచ్లో కీలక సెంచరీ సాధించాడు. పార్థివ్ పటేల్కు పోటీగా తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించి సెలక్టర్ల దృష్టి తనపై పడేలా చేశాడు.