
హైదరాబాద్: వషీం జాఫర్.. గతంలో భారత జట్టు తరుపున 31 టెస్టు మ్యాచ్లాడాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత కూడా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే వసీం జాఫర్ వయసు 40 ఏళ్లు. ఈ వయసులో కూడా తన బ్యాటింగ్లో జోరు తగ్గలేదు.
అంతేకాదు లేటు వయసులో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. నాగ్ పూర్లోని వీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతోన్న ఇరానీ కప్లో విదర్భ తరఫున ఆడుతున్న వసీం జాఫర్ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఇరానీ కప్లో భాగంగా విదర్భ, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది.
ఈ మ్యాచ్లో తొలిరోజు సెంచరీ బాదిన జాఫర్.. రెండో రోజు కూడా అదే ఫామ్ని కంటిన్యూ చేశాడు. రెండో రోజు ఆటముగిసే సమయానికి జాఫర్ 285 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మొత్తం 425 పరుగులు ఎదుర్కొన్న జాఫర్ 34 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ట్రిపుల్ సెంచరీకి చేరువయ్యాడు.
విదర్భ జట్టులో వసీం జాఫర్తో పాటు గణేశ్ సతీష్ (120), ఫయీజ్ ఫజల్ (89), సంజయ్ రామస్వామి (53), అపూర్వ వాంఖడే (44 నాటౌట్) రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ మూడు వికెట్ల నష్టానికి 598 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కాగా, తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 53వ సెంచరీ నమోదు చేసిన జాఫర్ దానిని డబుల్ సెంచరీగా మలచడం ద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 40 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఐదో భారత ఆటగాడిగా జాఫర్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఇరానీ కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు.
అంతకముందు ఈ రికార్డు తమిళనాడు క్రికెటర్ మురళీ విజయ్ పేరిట ఉంది. 2012-13 రంజీ సీజన్లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో మురళీ విజయ్ 266 పరుగులు నమోదు చేశాడు. ఇదే ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇప్పుడు ఈ స్కోరుని వసీం జాఫర్ అధిగమించాడు.
దీంతో ఇరానీ కప్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రెండో ఆటగాడిగానూ నిలిచాడు. మాజీ లెజెండరీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ మాత్రమే ఇప్పటి వరకు ఇరానీ కప్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఇప్పుడు ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా వసీం జాఫర్ అరుదైన ఘనత సాధించాడు.
ఫస్ట్క్లాస్ క్రికెట్లో మొత్తం 242 మ్యాచ్లు ఆడిన జాఫర్ 18,109 పరుగులు చేశాడు. వీటిలో 53 సెంచరీలు, 86 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 314 నాటౌట్. లేటు వయసులో కూడా వసీం జాఫర్ అద్భుత ప్రదర్శన చేస్తోండటంపై గంగూలీ, కైఫ్, ఆకాశ్ చోప్రాలు ట్విట్టర్ ప్రశంసల వర్షం కురిపించారు.