టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ బాదాడు. ఇరానీ కప్ 2024లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ద్విశతకంతో చెలరేగాడు. 253 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 24 ఫోర్లు, 4 సిక్సర్లతో హోరెత్తించాడు. సర్ఫరాజ్ ధాటికి ముంబై 500 పరుగులను దాటింది.
అయితే డబుల్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతలు అందుకున్నాడు. ఇరానీ కప్లో ద్విశతకం బాదిన తొలి ముంబై ప్లేయర్గా చరిత్రకెక్కాడు. అంతేగాక కనీసం 4000+ పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో అత్యధిక సగటు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సర్ఫరాజ్ 69.8 సగటుతో పరుగులు సాధిస్తున్నాడు. అగ్రస్థానంలో విజయ్ మర్చంట్ (81.8 సగటు) ఉన్నాడు.

ఈ జాబితాలో విజయ్ మర్చంట్, సర్ఫరాజ్ ఖాన్ తర్వాతి స్థానాల్లో అజయ్ శర్మ (68.7), శాంతాను సుగ్వేకర్ (63.1), విజయ్ హజారె (61.2) ఉన్నారు. కాగా, ఓవర్నైట్ స్కోరుతో 237/4 ఇవాళ రెండో రోజు ఆట ఆరంభించిన ముంబై ఆదిలోనే వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న కెప్టెన్ అజింక్య రహానె 97 పరుగుల వద్ద ఔటయ్యాడు. యశ్ దయాల్ బౌలింగ్లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రహానె-సర్ఫరాజ్ 131 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
కాసేపటికే షామ్స్ ములాని (5) కూడా ఔటవ్వడంతో ముంబై స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.అయితే ప్రత్యర్థి జట్టు మ్యాచ్పై పట్టు బిగించకుండా సర్ఫరాజ్.. తనుష్ కొటియన్ (64)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తనుష్తో కలిసి 183 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో 149 బంతుల్లో శతకం సాధించాడు. మరో 104 బంతుల్లో దాన్ని ద్విశతకంగా మలిచాడు.
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్కు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే రెండు టెస్టుల్లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్కు అవకాశం ఇవ్వడంతో అతను బెంచ్కే పరిమితమయ్యాడు. మరోవైపు ఇటీవల తన సోదరుడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాపాయం తప్పినప్పటికీ మెడ భాగంలో గాయాలయ్యాయి. అయినా సర్ఫరాజ్ మైదానంలో ఏకాగ్రత కోల్పోకుండా పరుగులతో సత్తాచాటుతుండటం విశేషం.