ముంబై: చివరలో రాయుడు ధాటిగా ఆడి ముంబై ఇండియన్స్ స్కోరు పెంచడంతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. ఛేజింగ్లో సంజూ శాంసన్ (76; 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) ఒంటరి పోరు చేసి గుబులు పుట్టించినా ముంబై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ శామ్సన్ ఒంటరిపోరాటంతో విజయానికి చేరువగా వచ్చినా, అతని జోరుకు మరో వైపు నుంచి సహకారం లభించకపోవడంతో 7 వికెట్లకు 179 స్కోరుకే పరిమితమైంది. రాజస్థాన్ను కట్టడి చేయడంలో మెక్క్లింగన్ (3/31) కీలకపాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టాప్ ఆర్డర్లో సిమన్స్ (38), పార్థివ్ పటేల్ (23 బంతుల్లో 14 బంతుల్లో 5 ఫోర్లు), రోహిత్ (27; 21 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్)లు తలా ఇన్ని పరుగులు సాధించినా, రాయుడు (53; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ, పొలార్డ్ (24; 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్)తో ముంబై 5 వికెట్లకు 187 పరుగులు చేసి రాజస్థాన్ను సవాల్ చేసింది.

12 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 109/2. అప్పటికి వాట్సన్ (28; 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔటైనా, సంజూ శామ్సన్ 42 పరుగులతో (29 బంతుల్లోనే) మంచి ఊపు మీద కనిపించాడు. అయితే, మిగతా బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. స్మిత్ (23) నాయర్ (7)లు శాంసన్కు సహకరించడంలో విఫలమ్యాయరు. మలింగ, మెక్క్లింగన్లు అత్యంత పొదుపుగా బంతులేయడంతో రాజస్థాన్ ఛేదించాల్సిన రన్రేట్ 12కి పైకి పాకిపోయింది. అయితే అప్పటికే జోరు మీదున్న శాంసన్ భారీషాట్లతో మరింత విజృంభించాడు. ప్రత్యేకించి మలింగ వేసిన 17వ ఓవర్లోని ఆఖరు రెండు బంతుల్ని 6, 4గా మలిచిన తీరు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసింది.
అప్పటికి 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సివున్నా, శాంసన్ మెరుపు బ్యాటింగ్ రాజస్థాన్కు విక్టరీపై భరోసా కలిగించింది. అయితే ఇదే ఊపులో తర్వాత ఓవర్లో మెక్క్లింగన్ను సూపర్ సిక్స్ కొట్టిన శాంసన్ ఆ వెంటనే ఔటయ్యాడు. అక్కడితో రాజస్థాన్ గెలుపు ఆశలు గల్లంతయ్యాయి.
ఓపెనర్ పార్థివ్ పటేల్ ముంబైకి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ధవళ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 4, 4.. ఆపై వరుసగా సౌథీని 4, థెరాన్ 4, 4 గా తరలించి ముంబై ప్రేక్షకులను అలరించాడు. పార్థివ్ నిష్క్రమించే సరికి ముంబై స్కోరు 5 ఓవర్లలో 43 పరుగులు. ఇక ఇన్నింగ్స్ రెండో బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ మరో ఓపెనర్ సిమన్స్ ఆ తర్వాత కొన్ని భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో వాట్సన్ వేసిన వరుస బంతుల్లో 4, 6 కొట్టాడు. ఫలితంగా ముంబై స్కోరులో మరింత ఊపొచ్చింది. తొమ్మిది ఓవర్లలో 73 పరుగులు.
భారీస్కోరు దిశగా సాగుతున్న ముంబైకి అంపైర్ తప్పుడు నిర్ణయం షాకిచ్చింది. పదో ఓవర్ తొలి బంతికే సిమన్స్ ఎల్బీడబ్ల్యు అయ్యాడు. అయితే, బంతి బ్యాట్ అంచుకు తగిలినట్టు రీప్లేలో స్పష్టమైంది. కొద్దిసేపటికి ఉన్ముక్త్ (13)తో పాటు కొన్ని మెరుపులకే పరిమితమైన కెప్టెన్ రోహిత్ (27) కూడా నిష్క్రమించడంతో ఆటపై రాజస్థాన్ పట్టుబిగించింది.
బహుశా 160-170 మధ్య స్కోరు చేస్తుందేమో -క్రీజులో పొలార్డ్-రాయుడులున్నా, అప్పటికి రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండడంతో ముంబై ఇన్నింగ్స్ గురించి నెలకొన్న అంచనా ఇది. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 126 పరుగులే చేసింది.
అయితే 17వ ఓవర్నుంచే ముంబై స్కోరు ఊపందుకుంది. అప్పటికే ఓ సిక్స్తో 13 బంతుల్లో 17 పరుగులు చేసిన రాయుడు, థెరాన్ వేసిన ఓవర్లో సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో 13 పరుగులొచ్చాయి. ఇక 18వ ఓవర్లో వాట్సన్ను పొలార్డ్ 6, రాయుడు 4 కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్లో సౌథీని రాయుడు ఒక్కడే 4, 6, 4 కొట్టడంతో 16 పరుగులు, థెరాన్ వేసిన ఆఖరు ఓవర్లో ఇద్దరూ చెరో ఫోర్ కొట్టడంతో 12 పరుగులు వచ్చాయి.