చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. సీఎస్కే స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ జట్టుకు దూరమయ్యాడు. భారత్ను విడిచి తమ స్వదేశానికి చేరాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కు ముస్తాఫిజుర్ అందుబాటులో ఉండట్లేదు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు మాత్రమే కాదు, తర్వాత సొంతమైదానంలో జరగనున్న కోల్కతా నైట్ రైడర్స్ పోరులో అతడు ఆడటం అనుమానమే.
అసలేం జరిగిదంటే.. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లకు అమెరికా, సూపర్-8, నాకౌట్ మ్యాచ్లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నాయి. కాగా, ఈ మెగాటోర్నీ పాల్గొనడం కోసం ఆటగాళ్లకు అమెరికా, వెస్టిండీస్ వీసా తప్పనిసరి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ దేశ ఆటగాళ్లకు యూఎస్ఏ వీసా ఏర్పాట్లు మొదలుపెట్టింది.

దీనిలో భాగంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ వెళ్లాడు. రేపు వీసా ప్రాసెస్ కోసం అతడు పనులు మొదలుపెట్టనున్నాడు. ఆ ప్రక్రియ ముగించుకుని ఆదివారం లేదా సోమవారం తిరిగి ఇండియాకు ముస్తాఫిజుర్ బయల్దేరనున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండటం అసాధ్యమే. అంతేగాక సోమవారం జరిగే కేకేఆర్ మ్యాచ్కు అతడు అనుమానమే. ఒకవేళ భారత్కు అతడు ఆదివారం చేరుకుంటే తుదిజట్టులో ఉంటాడు.
అయితే ముస్తాఫిజుర్ ఈ నెల చివరు వరకే సీఎస్కేకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వచ్చే నెలలో జింబాబ్వేతో జరగనున్న సిరీస్లో అతడు ఆడనున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ముస్తాఫిజుర్ నిలిచాడు. మూడు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ను సాధించాడు. చెపాక్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ముస్తాఫిజుర్ నాలుగు వికెట్లతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి కీలక వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్ల (2/30)తో ఫర్వాలేదనిపించాడు. కానీ ఇటీవల వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అతడు 47 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన సీఎస్కే రెండు విజయాలు సాధించింది.