
ముంబై: కోల్కతా నైట్రైడర్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యంను రాజస్థాన్ రాయల్స్ కస్టపడి ఛేదించింది. 134 పరుగులను మరో 7 బంతులు ఉండగా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజు శాంసన్ (42: 41 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబే (22: 18 బంతుల్లో 1 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (22: 17 బంతుల్లో 5 ఫోర్లు) పర్వాలేదనిపించగా.. డేవిడ్ మిల్లర్ (24) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోల్కతా మిస్టరి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు కోల్కతాకు ఇది నాలుగో ఓటమి.
రాయల్స్కు శుభారంభం దక్కలేదు:
ఛేదనలో రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (5) త్వరగానే పెవిలియన్ చేరాడు. క్రీజులో ఉన్నంతసేపు యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ (22) దూకుడుగా ఆడాడు. అతడికి శాంసన్ కాసేపు అండగా నిలిచాడు. అయితే శివం మావి వేసిన ఐదవ ఓవర్లో యశస్వి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో పవర్ప్లే ఆఖరికి రాజస్థాన్ 50/2తో నిలిచింది. శివమ్ దూబే అండతో శాంసన్ స్కోర్ బోర్డును ముందుకునడిపాడు. భారీ షాట్లు ఎక్కువగా ఆడకుండా.. స్ట్రైక్ రొటేట్ చేశాడు.
మూడో వికెట్కు 45 పరుగులు:
ఆచితూచి ఆడిన శాంసన్, దూబేలు మూడో వికెట్కు 45 పరుగులు జోడించి రాయల్స్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. అయితే మిస్టరి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ జోడీని విడదీశాడు. మరికొద్దిసేపటికే రాహుల్ తేవాతియా (5) కూడా ప్రసిద్ క్రిష్ణ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. శాంసన్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. డేవిడ్ మిల్లర్ అండతో చివరి వరకు నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టగా.. మావి, ప్రసిద్ తలో వికెట్ పడగొట్టారు.
కోల్కతా మెరుపుల్లేవ్:
అంతకుముందు కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు శుభారంభం దక్కలేదు. రాజస్థాన్ బౌలర్లు తమ పదునైన బంతులతో కేకేఆర్ బ్యాట్స్మన్ ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో పరుగులు చేయడానికి ప్రారంభం నుంచే కేకేఆర్ బ్యాట్స్మెన్ నానా అవస్థలు పడ్డారు. ముస్తాఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో శుభ్మన్ గిల్(11) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. చేతన్ సకారియా వేసిన 9వ ఓవర్ మొదటి బంతికే నితీశ్ రాణా (22) వెనుదిరిగాడు. దీంతో పవర్ప్లే ఆఖరికి కోల్కతా చేసింది 25 పరుగులు మాత్రమే. అయితే రాహుల్ త్రిపాఠీ (36: 26 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) మాత్రం కాస్త కొంత ధాటిగా ఆడాడు.
విఫలమైన రసెల్, కమిన్స్:
సునీల్ నరైన్ బౌండరీ బాది ఉనద్కట్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజ్లోకి వచ్చిన ఇయాన్ మోర్గాన్.. ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు. దీంతో 61 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన కోల్కతా పీకల్లోతు కష్టాల్లో పడింది. దినేశ్ కార్తీక్ (25) అండతో ధాటిగా ఆడిన త్రిపాఠీ కీలక సమయంలో పెవిలియన్ చేరాడు. కార్తీక్ పర్వాలేదనిపించినా.. జట్టు స్కోరు పెంచడంతో ఉపయోగపడలేదు. ఆండ్రూ రసెల్ (9: 7 బంతుల్లో.. 1 సిక్స్), పాట్ కమిన్స్ (10) కూడా రాణించలేదు. చివరలో మావి 7 బంతులు ఆడి 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్ 4 వికెట్లతో అదరగొట్టాడు. ఉనద్కత్, సకారియా, ముస్తాఫిజుర్లకు తలా ఓ వికెట్ దక్కింది.