
చెన్నై: చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 'సూపర్ ఓవర్'లో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన సూపర్ ఓవర్లో ఢిల్లీ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సన్రైజర్స్ నిర్ధేశించిన 8 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ చివరి బంతికి ఛేదించింది. ఈ సీజన్లో జరిగిన తొలి సూపర్ ఓవర్ మ్యాచ్గా ఇది రికార్డులకెక్కింది. మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం కేన్ విలియమ్సన్ (66 నాటౌట్) రాణించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఏడు పరుగులు చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని ఢిల్లీ ఛేదించి గెలిచింది.
సూపర్ ఓవర్ ఇలా:
సూపర్ ఓవర్లో సన్రైజర్స్ నుంచి వార్నర్, విలియమ్సన్ బ్యాటింగ్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఆరు బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసింది. అక్షర్ పటేల్ వేసిన సూపర్ ఓవర్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మన్ పరుగులు తీయడంలో ఇబ్బందులు పడ్డారు. మూడో బంతికి కేన్ ఓ బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు తీసినా.. షార్ట్ రన్ కారణంగా ఒకటే వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ధావన్, పంత్లు బరిలోకి దిగగా.. ఎస్ఆర్హెచ్ నుంచి రషీద్ ఖాన్ బౌలింగ్కు వచ్చాడు. రషీద్ తన మ్యాజిక్ స్పెల్తో మాయ చేయాలని చూసినా.. ఆఖరి బంతికి సింగిల్ తీసి ఢిల్లీ సూపర్ ఓవర్లో విజయం సాధించింది.
కేన్ మామ ఫిఫ్టీ:
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దాంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఛేదనలో బెయిర్స్టో (38: 18 బంతుల్లో 3X4, 4X6), విలియమ్సన్ (66 నాటౌట్: 51 బంతుల్లో 8X4) రాణించారు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమైన వేళ సన్రైజర్స్ 15 పరుగులే చేసింది. ఆఖర్లో జగదీశ సుచిత్ (14 నాటౌట్; 6 బంతుల్లో 2x4, 1x6) రాణించాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, అక్షర్ పటేల్ 2, అమిత్ మిశ్రా ఒక వికెట్ తీశారు.
పృథ్వీ షా జోరు:
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి అదిరే శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా (53: 39 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్), శిఖర్ ధావన్ (28; 26 బంతుల్లోనే 3 ఫోర్లు) దంచికొట్టారు. ముఖ్యంగా పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలతో చెలరేగుతూ సన్రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ప్లే ఆఖరికి ఢిల్లీ 51/0తో నిలిచింది. ఈ క్రమంలోనే షా 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 81 పరుగులు జోడించారు.
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్:
ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్న షా, గబ్బర్ జోడీని రషీద్ ఖాన్ విడదీశాడు. 11వ ఓవర్లో ధావన్ను బౌల్డ్ చేసి సన్రైజర్స్కు భారీ ఊరటనిచ్చాడు. తర్వాతి ఓవర్లోనే దూకుడుమీదున్న పృథ్వీ రనౌటయ్యాడు. దాంతో ఢిల్లీ 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆపై రిషబ్ పంత్ (37: 27 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్), స్టీవ్ స్మిత్ (34: 25 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సిద్ధ్ర్థ్ కౌల్ వేసిన 19వ ఓవర్లో పంత్, హెట్మేయర్ (2) పెవిలియన్ చేరారు. ఆఖరి ఓవర్లో స్మిత్ ధాటిగా ఆడి 14 పరుగులు రాబట్టాడు. సన్రైజర్స్ బౌలర్లలో సిద్దార్థ్ రెండు, రషీద్ ఒక వికెట్ పడగొట్టారు.