అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం రాత్రి అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (60 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (40; 26 బంతుల్లో 4×4, 1×6), ఇషాన్ కిషన్ (37; 36 బంతుల్లో 4×4, 1×6), సౌరభ్ తివారి (33; 23 బంతుల్లో 4×4, 1×6) కూడా రెచ్చిపోవడంతో ముంబై భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ బౌలర్ శ్రేయస్ గోపాల్ 2 వికెట్లు తీశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ క్వింటాన్ డీకాక్ (6) విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లు ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే 83 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. కార్తీక్ త్యాగి వేసిన 11 ఓవర్ నాల్గో బంతికి ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మరో ఐదు పరుగుల వ్యవధిలో ముంబై సూర్యకుమార్ వికెట్ను కూడా కోల్పోయింది. శ్రేయస్ గోపాల్ వేసిన 13 ఓవర్ రెండో బంతికి షాట్ ఆడిన సూర్యకుమార్.. స్టోక్స్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ (6) నిరాశపరిచాడు. చివరి ఓవర్లలో సౌరవ్ తివారీ, హార్దిక్ పాండ్యాలు బ్యాట్ ఝుళిపించారు. ముఖ్యంగా హార్దిక్ సిక్సులు వర్షం కురిపించారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.
15 ఓవర్లు ముగిసే సరికి ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రాజస్తాన్ కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసినట్లు కనబడింది. అయితే హార్దిక్ పాండ్యా, సౌరవ్ తివారీలతో చెలరేగి ఆడారు. కార్తీక్ త్యాగి వేసిన 16 ఓవర్లో ఐదు పరుగులే వచ్చినా.. ఆ తర్వాత జోరందుకున్నారు. జోఫ్రా ఆర్చర్ వేసిన 17 ఓవర్లో తివారీ రెండు ఫోర్లు, సిక్స్ కొట్టాడు. దాంతో ఆ ఓవర్లో మొత్తం 17 పరుగులు వచ్చాయి.
అంకిత్ రాజ్పుత్ వేసిన 18 ఓవర్లో హార్దిక్ చెలరేగిపోయాడు. తొలి బంతికి సిక్స్ కొట్టిన హార్దిక్.. 4, 5, 6 బంతుల్ని సిక్స్లు కొట్టాడు. హార్దిక్ హ్యాట్రిక్ సిక్స్లు సాధించడంతో ఆ ఓవర్లో 27 పరుగులు వచ్చాయి. ఇక ఆర్చర్ వేసిన 19 ఓవర్ తొలి బంతికి సౌరవ్ ఔట్ కావడంతో మూడు పరుగులే వచ్చాయి. త్యాగి వేసిన చివరి ఓవర్లో హార్దిక్ మూడు సిక్స్లు, రెండు ఫోర్లు కొట్టడంతో ముంబై ఇండియన్స్ 27 పరుగులు పిండుకుంది. చివరి ఐదు ఓవర్లలో ముంబై వికెట్ మాత్రమే కోల్పోయి 79 పరుగులు చేసింది