
ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ:
ముంబై నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. జేమ్స్ ప్యాటిన్సన్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి రాబిన్ ఉతప్ప (13) కీరన్ పొలార్డ్ చేతికి చిక్కాడు. అయితే ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో బెన్ స్టోక్స్ మొత్తం నాలుగు ఫోర్లు బాదడంతో స్కోర్ వేగం పెరిగింది. బుమ్రా వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి స్టీవ్ స్మిత్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో స్మిత్ (11) ఔట్ అయ్యాడు. ప్యాటిన్సన్ వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతికి బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది.

స్టోక్స్ సెంచరీ:
భారీ టార్గెట్ ముందుండడంతో బెన్ స్టోక్స్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే క్రీజులో కుదురుకునే వరకు సంజూ శాంసన్ ఆచితూచి ఆడాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న స్టోక్స్.. 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టోక్స్కు శాంసన్ కూడా జతకలవడంతో రాజస్థాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఎక్కడా కూడా ముంబై బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. స్టోక్స్, శాంసన్ జోడీ ఎలాంటి ఒత్తిడి లేకుండా 150కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 44/2తో కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడి అద్భుత విజయాన్ని అందించారు. ప్యాటిన్సన్ వేసిన 19 ఓవర్లో తొలి రెండు బంతుల్ని సిక్స్, ఫోర్లు కొట్టిన స్టోక్స్ విజయాన్ని ఖాయం చేశాడు. ఇది రాజస్తాన్కు ఐదో విజయం కాగా, ముంబైకు నాల్గో ఓటమి.

ఆదుకున్న సూర్యకుమార్:
అంతకుముందు ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. 7 పరుగుల వద్దే క్వింటన్ డికాక్ (6) వికెట్ కోల్పోయినా ముంబై జోరు తగ్గకుండా ఆడింది. వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (40; 26 బంతుల్లో 4×4, 1×6), మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (37; 36 బంతుల్లో 4×4, 1×6) రెచ్చిపోయారు. వీరిద్దరూ బౌండరీలే లక్ష్యంగా ఆడారు. దీంతో 10 ఓవర్లకు ముంబై 89/1తో నిలిచింది. రెండో వికెట్కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని కార్తీక్ త్యాగి విడదీశాడు. ఇషాన్ను ఔట్ చేశాడు. అప్పుడు స్కోరు 90/2. ఇక అర్ధ శతకం సాధించిన సూర్యకుమార్తో పాటు అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పొలార్డ్ను శ్రేయస్ గోపాల్ 13వ ఓవర్లో పెవిలియన్ పంపించాడు.

రెచ్చిపోయిన హార్దిక్:
ఆ తర్వాత వరుసగా రెండు వికెట్లు చేజార్చుకోవడంతో ముంబై రన్రేట్ కాస్త తగ్గింది. హార్దిక్ పాండ్యా (60 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు) తో కలిసి సౌరభ్ తివారి (33; 23 బంతుల్లో 4×4, 1×6) మంచి షాట్లతో అలరించాడు. అంకిత్ రాజ్పుత్ వేసిన 18వ ఓవర్ను హార్దిక్ లక్ష్యంగా ఎంచుకున్నాడు. నాలుగు సిక్సర్లు బాదేసి స్కోరును అమాంతం పెంచాడు. 19వ ఓవర్లో తివారిని ఔట్ చేసిన జోఫ్రా ఆర్చర్ 3 పరుగులే ఇచ్చినా.. ఆఖరి ఓవర్లో పాండ్యా రెచ్చిపోయాడు. 6, 4, 4, 6, 6తో జట్టు స్కోరును 195కు తీసుకెళ్లాడు. పాండ్యా దెబ్బకు ముంబై ఆఖరి 4 ఓవర్లలో 60 పరుగులు రాబట్టింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, గోపాల్ రెండేసీ వికెట్లు పడగొట్టారు.


Click it and Unblock the Notifications
