
టాప్ ఆర్డర్ విఫలం:
197 పరుగుల భారీ లక్ష్య ఛేదనను బెంగళూరు దారుణంగా ఆరంభించింది. 27 పరుగులకే ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (4), అరోన్ ఫించ్ (13)లను ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ పెవిలియన్కు చేర్చారు. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్ (9)తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ డివిలియర్స్ను అన్రిచ్ నోర్జె ఔట్ చేసి బెంగళూరును దెబ్బ తీశాడు. భారీ షాట్ ఆడిన ఏబీ.. శిఖర్ ధావన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.దీంతో బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో పడింది.

కోహ్లీ ఒంటరి పోరాటం:
ఈ సమయంలో విరాట్ కోహ్లీ కాసేపు వేగం కనబరిచాడు. మరోవైపు అతనికి సహకారం అందించే బ్యాట్స్మన్ కరువయ్యాడు. మొయిన్ అలీ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయినా కోహ్లీ క్రీజులో ఉండటంతో బెంగళూరు శిబిరంలో ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే హర్షల్ పటేల్ బౌలింగ్లో సిక్సర్ బాది గేర్ మార్చిన కోహ్లీని..తర్వాతి ఓవర్లోనే రబాడ బోల్తా కొట్టించాడు. 14వ ఓవర్లో విరాట్ వికెట్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతోనే బెంగళూరు ఓటమి దాదాపు ఖాయమైంది. ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుస విరామాల్లో బెంగళూరు బ్యాట్స్మన్ పెవిలియన్ బాటపట్టారు. రబాడ పదునైన బంతులకు బెంగళూరు కోలుకోలేకపోయింది. చివరకు భారీ ఓటమిని చవిచూసింది. ఢిల్లీ బౌలర్లలో రబాడ నాలుగు.. అక్షర్, నోర్జె చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

షా దూకుడు:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచి పృథ్వీ షా (42; 23 బంతుల్లో, 5×4, 2×6) బౌండరీల మోత మోగించడంతో ఢిల్లీకి శుభారంభం లభించింది. అతడికి తోడుగా శిఖర్ ధావన్ (32; 28 బంతుల్లో, 3×4) కూడా మెరవడంతో పవర్ప్లేలో ఢిల్లీ 63 పరుగులు చేసింది. అయితే 7వ ఓవర్లో షాను మొహమ్మద్ సిరాజ్ బోల్తా కొట్టించాడు. కొద్దిసేపటికే ధావన్, శ్రేయస్ అయ్యర్ (11) కూడా ఔటవ్వడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (37; 25 బంతుల్లో, 3×4, 2×6), మార్కస్ స్టోయినిస్ (53; 26 బంతుల్లో, 6×4, 2×6) మరో వికెట్ పడకుండా నెమ్మదిగా ఆడటంతో 13వ ఓవర్లో ఆ జట్టు స్కోరు 100 పరుగులు దాటింది.

స్టోయినిస్ మెరుపులు:
క్రీజులో కుదురుకున్న స్టోయినిస్ గేర్ మార్చి బౌండరీల మోత మోగించాడు. మొయిన్ అలీ బౌలింగ్లో సిక్సర్, ఫోర్.. సైని ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. పంత్ కూడా చెలరేగంతో పరుగుల వరద పారింది. ఈ క్రమంలో స్టోయినిస్ 24 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆఖరి ఓవర్లో హెట్మెయిర్ (11*) సిక్సర్ బాదడంతో ఢిల్లీ 196 పరుగులు సాధించింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ (2/32) రాణించాడు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












