
అబుదాబి: ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. ముంబై లక్ష్యం 163. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (69 నాటౌట్; 52 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ ) అర్ధశ తకంతో రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42; 33 బంతుల్లో 5 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఆద్యంతం ధావన్ ధాటిగా ఆడకున్నా.. చూడచక్కని షాట్లతో అలరించాడు. ముంబై బౌలర్లు కృనాల్ పాండ్యా (2/26), ట్రెంట్ బౌల్ట్ (1/36) ఢిల్లీని కట్టడి చేశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. ఇన్నింగ్స్ను పేలవంగా ఆరంభించింది. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మూడో బంతికే పృథ్వీ షా (4) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత స్పిన్నర్ కృనాల్ పాండ్యా వేసిన ఐదో ఓవర్లో వన్డౌన్లో వచ్చిన అజింక్య రహానే (15) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. సీజన్లో రహానే తొలి మ్యాచ్ ఆడాడు. ఆరంభం నుంచి ముంబై బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడారు.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ముచ్చటైన షాట్లతో వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 85 పరుగులు జోడించారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో కృనాల్ బౌలింగ్లో శ్రేయస్ ఔటయ్యాడు. దీంతో మూడో వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. బౌల్ట్ వేసిన 16వ ఓవర్లో ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సీజన్లో అతనికిదే తొలి హాఫ్సెంచరీ. ఇదే ఓవర్లో మార్కస్ స్టాయినీస్ (13; 8 బంతుల్లో 2×4) వరుసగా రెండు ఫోర్లు బాది ప్రమాదకరంగా కనిపించాడు.
రాహుల్ చహర్ వేసిన 17వ ఓవర్లో అనూహ్యంగా స్టాయినీస్ రనౌట్ అయ్యాడు. రెండో పరుగు కోసం ప్రయత్నించిన స్టాయినిస్ రనౌటయ్యాడు. దీంతో స్కోరు వేగం తగ్గింది. డెత్ ఓవర్లలోనూ ఢిల్లీ భారీగా పరుగులు రాబట్టలేకపోయింది. చివరి బంతి వరకు క్రీజులో ఉన్నా ధావన్ స్కోరును 160 దాటించాడు. ముంబై బౌలర్లలో కృనాల్ రెండు వికెట్లు, బౌల్ట్ ఒక్క వికెట్ తీశారు.