
దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆ జట్టు ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ నిజంగా జీనియస్ అని, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన మ్యాచ్లో బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పై కోహ్లీ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడని మెచ్చుకున్నాడు. ఐపీఎల్-13లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నైపై బెంగళూరు 37 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో విరాట్ కొహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 90 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. వినూత్న షాట్లు ఆడి అభిమానులను అలరించాడు. ఒక దశలో 16వ ఓవర్ వరకు 116 పరుగులతో నత్తనడకన సాగుతున్న ఆర్సీబీ ఇన్నింగ్స్ను కోహ్లీ.. శివమ్ దూభేతో కలిసి బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత క్రిస్ మోరిస్ మూడు కీలక వికెట్లు తీయడంతో సీఎస్కే ఓటమిపాలయింది. మ్యాచ్ అనంతరం మోరిస్ స్పందించాడు.
'మా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా జీనియస్. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పై బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ పేసర్లకు అనుకూలిస్తూ టెస్టు మ్యాచ్లకు సరిపోలిన వికెట్పై మొదట్లో ఆచితూచి ఆడిన విరాట్.. ఆ తర్వాత బ్యాట్తో రెచ్చిపోయాడు. 16వ ఓవర్ వరకు చెన్నై బౌలర్లకు మంచి అవకాశంగా కనిపించింది. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. తాను నిలదొక్కుంటే ఎంత ప్రమాదమో చేసి చూపించాడు. కఠిన పరిస్థితుల్లో చెన్నై బౌలర్లను తట్టుకొని కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్లో ఇన్నాళ్ల అంతర్జాతీయ అనుభవం స్పష్టంగా కనిపించింది. అందుకేనేమో ఐపీఎల్లో అత్యధిక పరుగుల సాధించిన జాబితాలో అతడి పేరు కూడా ఉంటుంది' అని మోరిస్ అన్నాడు.
'ఒక లీడర్గా జట్టును గెలిపించాలని చూసే విరాట్ కోహ్లీ మార్గదర్శనంలో నడవడం నాకు అదృష్టమనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ సీజన్లో అడుగుపెట్టిన నేను మొదటలో కాస్త ఒత్తడికి లోనయ్యాను. కానీ నా వంతు ప్రయత్నంగా జట్టును గెలిపించాలనే ప్రయత్నం చేశా. మొదటి మ్యాచ్లోనే మూడు వికెట్లు తీయడం ద్వారా విరాట్ నమ్మకాన్ని నిలబెట్టాను. అందుకు సంతోషంగా ఉన్నా' అని క్రిస్ మోరిస్ తెలిపాడు. ఆర్సీబీ 2019 డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో మోరిస్ను రూ.10 కోట్లు చెల్లించి కొనుక్కున్న విషయం తెలిసిందే. కానీ ఆర్సీబీ తాను ఆడిన మొదటి 5 మ్యాచ్ల్లో మోరిస్ను ఆడించకపోవడం విశేషం