నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధత
తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ అనంతరం మళ్లీ నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధం ఏర్పడింది. దీంతో మళ్లీ No. 4పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రదర్శనను బట్టే వరల్డ్కప్ టీమ్ ఎంపిక ఉంటుందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. మే30న ప్రారంభమయ్యే వన్డే వరల్డ్కప్కు ఏప్రిల్ 20న సెలక్టర్లు 15మందితో కూడిన జట్టుని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
ఐపీఎల్ 2019 సీజన్ ఎంతో కీలకం
దీంతో ఐపీఎల్ 2019 సీజన్ ఎంతో కీలకం కానుందని ఆ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఐపీఎల్లో రాణించిన వాళ్లకు వరల్డ్కప్లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనే అన్ని స్థానాలకు ప్లేయర్స్ దొరుకుతారు అని భావించినా.. నాలుగో స్థానంలో మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ స్థానంలో ఎవరూ రాణించలేదు" అని అన్నారు.
ఈ స్థానం కోసం నలుగురు పోటీ
"ప్రస్తుతానికి ఈ స్థానం కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అజ్యింకె రహానే, అంబటి రాయుడు, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ NO.4 స్థానం రేసులో ఉన్నారు. వీళ్లంతా ఐపీఎల్లో ఎలా ప్రదర్శిస్తారనే దానిపై వరల్డ్కప్ జట్టు ఎంపిక ఆధారపడి ఉంటుంది. నాలుగో స్థానానికి ఇంకా ఏ ఆటగాడు కూడా అధికారికంగా ఖరారు కాలేదు. ఈ స్థానం కోసం ఇంకా పోటీ ఉంది" అని ఆయన తెలిపారు.
నాలుగో స్థానంలో కుదురుకుంటారని
"గతేడాది కొంత మంది ఆటగాళ్లు నాలుగో స్థానంలో కుదురుకుంటారని భావించినా అలా జరగలేదు. దీంతో తొలి నెల ఐపీఎల్లో రాణించిన ప్లేయర్కు ఈ స్థానం దక్కే అవకాశం ఉంది" అని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నాతాధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు జట్టు మేనేజ్మెంట్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.
రేసులోకి రహానే, శ్రేయాస్ అయ్యర్
రహానే, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికీ వరల్డ్కప్ జట్టులో తమకు చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో రాణిస్తే NO.4 తమదేనని ఈ ఇద్దరూ ఇప్పటికే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సోమవారం రహానే మాట్లాడుతూ వరల్డ్కప్ టీమ్ గురించి తాను ఆలోచించడం లేదని, అయితే ఐపీఎల్లో రాణిస్తే టీమ్లో చోటు అదే దక్కుతుందని చెప్పిన సంగతి తెలిసిందే.