ఆ మధ్య బీసీసీఐ జారీ చేసిన ఆదేశాలను పెడచెవిన పెట్టి వేటుకు గురైన టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. ఇప్పుడిప్పుడే కాస్త అవకాశాలు అందుకుని, మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చి ఆడుతున్నాడు. దేశవాళీలో ఆడకుండా ఐపీఎల్ సన్నాహాకంలో పాల్గొన్నందుకు బీసీసీఐ.. ఇషాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడటం వల్ల అతడిపై బీసీసీఐ జాలీ చూపింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడేమో ఓ యువ వికెట్ కీపర్ కూడా ప్రస్తుతం ఇషాన్ లా వ్యవహరించాడు. దీంతో అతడిపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని క్రీడాభిమానుల్లో అనుమానాలు తలెత్తాయి.
అతడు ఎవరంటే
రంజీ ట్రోఫీలో దిల్లీ జట్టుకు వికెట్ కీపర్ అనుజ్ రావత్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే నెక్ట్స్ రౌండ్ కోసం ఆటగాళ్లకు క్యాంప్ నిర్వహిస్తోంది టీమ్. కానీ రావత్ దీనికి హాజరుకాకుండా.. సూరత్లో జరుగుతున్న ఐపీఎల్ ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నాడు.

గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మూడేళ్ల పాటు ఆడిన రావత్.. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ తన ట్రైనింగ్ సెక్షన్ ను ప్రారంభించింది. ఈ ప్రాక్టీస్ సెషన్ కు అనుజ్ రావత్తో పాటు ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, మహిపాల్ లామ్రోర్, కుమార్ కుశాంగ్రా, అర్షద్ ఖాన్ వంటి క్రికెటర్లు హాజరయ్యారు.
అయితే రావత్ ఇలా వెళ్లాలంటే కచ్చితంగా రాష్ట్ర అసోషియేషన్ అనుమతి తీసుకోవాలి. కానీ అతడు ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్లాడో తెలీదని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ అన్నారు. చూడాలి మరి రావత్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.