ప్రపంచ శాంతి అంట: IPL క్రేజ్ ముందు PSL డ్రామా బట్టబయలు!
IPL vs PSL: పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీసుకుంటున్న వింత నిర్ణయాలు.. ఆ దేశ క్రికెట్ ఫ్రాంచైజీ యజమానుల అతి తెలివి తేటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ప్రస్తుతం కేవలం రెండు వేదికల్లో.. అదీ ప్రేక్షకులు లేకుండా మూసివేసిన తలుపుల మధ్య జరగుతోంది. స్టేడియాలు ఖాళీగా ఉండటంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ యజమాని అలీ నఖ్వీ వింత వాదనను తెరపైకి తెచ్చారు. భారత్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేస్తూ.. పీఎస్ఎల్ ఖాళీగా ఉండటానికి 'ప్రపంచ శాంతి'కి తాము చేస్తున్న కృషియే కారణమని అలీ నఖ్వీ చెప్పుకొచ్చారు.
అమెరికా-ఇరాన్ చర్చల సాకుతో..
ఇస్లామాబాద్ యునైటెడ్ యజమాని అలీ నఖ్వీ మాట్లాడుతూ.. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోందని.. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించడం లేదని అలీ నఖ్వీ పేర్కొన్నారు. స్టేడియంలో ఫ్యాన్స్ ఉండటం కంటే అంతర్జాతీయ శాంతిని నెలకొల్పడమే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ లాంటి లీగ్లలో స్టేడియాలు నిండుగా ఉంటాయని.. కానీ పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆ దేశాలకు లేవని చెబుతూ ఐపీఎల్పై పరోక్షంగా సెటైర్లు వేశారు.

పీసీబీ చీఫ్ చెప్పిందేమిటి?.. ఫ్రాంచైజీ యజమాని చెబుతున్నదేమిటి?
అయితే ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ ఓనర్ అలీ నఖ్వీ కామెంట్లు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ గతంలో ఇచ్చిన వివరణకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. పీఎస్ఎల్ మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండా నిర్వహించడానికి కారణం పాకిస్థాన్లో నెలకొన్న తీవ్రమైన 'ఇంధన సంక్షోభం'అని పీసీబీ చీఫ్ ఇదివరకే స్పష్టం చేశారు. వేలాది మంది ప్రేక్షకులు స్టేడియాలకు రావడం వల్ల దేశంలోని పరిమితమైన ఇంధన నిల్వలు హరించుకుపోతాయని.. అందుకే ప్రధాని సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ అప్పట్లో వెల్లడించారు. కానీ ఇప్పుడే ఫ్రాంచైజీ యజమాని దీనికి విదేశీ విధానం, ప్రపంచ శాంతి అంటూ కొత్త రంగు పులమడం హాస్యాస్పదంగా మారింది.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం!
2026 నాటికి పాకిస్థాన్ సూపర్ లీగ్ను ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్గా మారుస్తామని పీసీబీ ప్రగల్భాలు పలికినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. కేవలం రెండు నగరాలకే లీగ్ ను పరిమితం చేయడం.. ప్రేక్షకులను దూరం పెట్టడం పీఎస్ఎల్ బ్రాండ్ విలువను దెబ్బతీసీంది. ఇంధన కొరత వంటి దేశీయ సమస్యలను కప్పిపుచ్చుకోవడానికి అంతర్జాతీయ రాజకీయాలను సాకుగా చూపడం కేవలం ప్రచారం కోసమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాజిక్ లేని ఇటువంటి కారణాలు చెప్పడం వల్ల పాకిస్థాన్ క్రికెట్ పరువు గంగలో కలుస్తోందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి స్టేడియంలో జనం లేకపోవడాన్ని సమర్థించుకోవడానికి పీఎస్ఎల్ యజమానులు ఆడుతున్న ఈ శాంతి నాటకం ఐపీఎల్ క్రేజ్ ముందు తేలిపోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications