IPL vs PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ సూపర్ లీగ్కు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. విదేశీ ప్లేయర్లు, చివరికి కామెంటేటర్లు కూడా పీఎస్ఎల్ను మధ్యలోనే వదిలేసి ఐపీఎల్ కోసం భారత్ కు పయనమవుతున్నారు.
కామెంటేటర్ నిక్ నైట్ ట్విస్ట్
పాకిస్థాన్ సూపర్ లీగ్ బ్రాడ్కాస్ట్ ప్యానెల్లో ఉన్న దిగ్గజ కామెంటేటర్ నిక్ నైట్.. తాజాగా ఆ లీగ్ నుంచి తప్పుకుని ఐపీఎల్ కామెంటరీ బాక్స్లో చేరారు. వాస్తవానికి పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ప్రారంభంలో నిక్ నైట్ తమ టీమ్లో ఉంటారని పాక్ బోర్డు ప్రకటించింది. కానీ శుక్రవారం స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఐపీఎల్ వ్యాఖ్యాతల జాబితాలో రవిశాస్త్రి, ఇయాన్ బిషప్ వంటి దిగ్గజాల నిక్ నైట్ పేరు ఉండటం గమనార్హం.

పాకిస్థాన్ సూపర్ లీగ్ వీడుతున్న స్టార్ ప్లేయర్లు
కామెంటేటర్ల కాదు.. విదేశీ ప్లేయర్లు కూడా ఐపీఎల్ వైపే మొగ్గు చూపుతున్నారు. వరుసగా రెండో ఏడాది కూడా పీఎస్ఎల్, ఐపీఎల్ షెడ్యూల్స్ క్లాష్ అవ్వడం పాక్ లీగ్కు శాపంగా మారింది. ఇప్పటికే ముగ్గురు కీలక ఆటగాళ్లు పీఎస్ఎల్ జట్లను వదిలి ఐపీఎల్ జట్లతో చేరిపోయారు. బ్లెస్సింగ్ ముజర్బానీ, దసున్ శనకస స్పెన్సర్ జాన్సర్ తమ పీఎస్ఎల్ కాంట్రాక్టులను పక్కనపెట్టి, ఐపీఎల్లో రీప్లేస్మెంట్ ప్లేయర్లుగా భారత్కు రావాలని నిర్ణయించుకున్నారు.
మొహ్సిన్ నఖ్వీ హెచ్చరికలు బేఖాతరు
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్లేయర్లు పీఎస్ఎల్ వేలంలో అమ్ముడైన తర్వాత మధ్యలో ఐపీఎల్ను ఎంచుకోవడం నిరాశాజనకమని నఖ్వీ పేర్కొన్నారు. "షెడ్యూల్స్ కలవడం మా ప్రధాన సమస్య కాదు. కానీ కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించే క్రీడాకారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పీఎస్ఎల్ నిబద్ధతను గౌరవించని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు." అని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ వార్నింగ్ ఇచ్చారు. అయితే మొహ్సిన్ నఖ్వీ చేస్తున్న హెచ్చరికలను ఆటగాళ్లు పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఐపీఎల్ ఇచ్చే భారీ రెమ్యునరేషన్, ప్రపంచవ్యాప్త క్రేజ్ ముందు పీఎస్ఎల్ వెలవెలబోతోంది.