IPL vs PSL: ప్రస్తుతం ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2025 భారత్లో జరుగుతుండగా.. పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) 2025 పాకిస్తాన్ లో జరుగుతోంది. ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్గా మారింది. అయితే పాకిస్థాన్ ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ను తరచుగా ఐపీఎల్తో పోల్చుతున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ను కూడా ఇలాంటి ప్రశ్నే అడిగారు. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ తగిన సమాధానం ఇస్తూ పాకిస్తానీ జర్నలిస్టు నోరు మూయించాడు.
తగిన సమాధానం ఇచ్చిన సామ్ బిల్లింగ్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో లాహోర్ ఖలందర్స్ తరపున సామ్ బిల్లింగ్స్ ఆడుతున్నాడు. అయితే విలేకరుల సమావేశంలో ఐపీఎల్ వర్సెస్ పీఎస్ఎల్ గురించి అడిగినప్పుడు.. ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పి పాక్ మీడియా నోరు మూయించాడు. ఎవరు ఏమి చెప్పినా తాను తన వైఖరికే కట్టుబడి ఉంటానని.. ప్రపంచంలోని ఏ ఇతర టీ20 లీగ్ కూడా ఐపీఎల్ కు సమానంగా ఉండదన్నాడు. తాను తెలివతక్కువగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అని బిల్లింగ్స్ అడిగాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నమెంట్ గా ఐపీఎల్ ను విస్మరించడం కష్టమని చెప్పాడు. ఇది చాలా స్పష్టంగా ఉందని.. అనవసరంగా ఈ ప్రశ్న అడగడంలో అర్థం లేదన్నాడు. ప్రపంచంలో ఏ టోర్నమెంట్ అయినా ఐపీఎల్ తర్వాతేనని సామ్ బిల్లింగ్స్ స్పష్టం చేశాడు. పీఎస్ఎల్ ను ఐపీఎల్ తో పోల్చలేమని చెప్పాడు.

ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు పాకిస్తాన్ మీడియా ముందే ఐపీఎల్ మెరుగ్గా ఉందని ప్రకటించారు. కానీ పాకిస్తాన్ జర్నలిస్టులు భారత్ ను చర్చలోకి లాగడం ద్వారా ఐపీఎల్ ను తక్కువ చేసి వార్తలను సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పదేపదే విఫలమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్ ఓ ప్రశ్న అడిగారు. ఐపీఎల్ లో అమ్ముడుపోకుండా పీఎస్ఎల్ లో ఆడినందుకు భారత ఫ్యాన్స్ నుంచి ఎంత ద్వేషం వచ్చిందని అడిగాడు. దానికి సమాధానమిస్తూ.. నేను దీని గురించి వినడం ఇదే మొదటి సారి అంటూ సమాధానమిచ్చాడు.
గెలిచిన లాహోర్ ఖలందర్స్
మంగళవారం పీఎస్ఎల్ 2025లో భాగంగా లాహోర్ ఖలందర్స్. కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లాహోర్ ఖలందర్స్ 65 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లాహోర్ ఖలందర్స్ తరపున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫఖర్ జమాన్ 76 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా, డారిల్ మిచెల్ 75 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో సామ్ బిల్లింగ్స్ 19 పరుగులు చేశాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరాచీ కింగ్స్ 19.1 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. కరాచీ కింగ్స్ తరపున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఖుష్దిల్ షా 39 పరుగులతో భారీ స్కోరర్ గా నిలిచాడు. లాహోర్ ఖలందర్స్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, రియాద్ హుస్సేన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.